జంతు సంక్షేమం అందరి బాధ్యత
ఖమ్మంఅర్బన్: ‘జంతువుల పట్ల కరుణ చూపడం మానవత్వానికి నిదర్శనం. జంతు సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతతో పాటు సమాజం మొత్తం తీసుకోవాల్సిన బాధ్యత’అని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి డా.పురంధర్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని టేకులపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన జంతు సంక్షేమ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జంతువులు మాట్లాడలేని జీవులని, వాటి ఆరోగ్యం, సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీధి జంతువుల సమస్యలు, జంతువులపై జరుగుతున్న అమానుష దాడులు, కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జంతువులకు ఆహారం, నీరు అందించడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పునకు దారి తీస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా, విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, పాకబండ పశువైద్యాధికారి కె.క్రాంతికుమార్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ టి.కృష్ణ, వెటర్నరీ అసిస్టెంట్ మణిదీప్ పాల్గొన్నారు.
జంతు సంక్షేమం అందరి బాధ్యత


