ఔట్సోర్సింగ్ సిబ్బందిలో కలవరం
భవితవ్యం అయోమయం
● ఎస్సీ సంక్షేమశాఖలో 20 మంది భవితవ్యం ప్రశ్నార్థకం ● తొలగింపు ప్రచారంతో భయం.. భయం ● అదే జరిగితే ఎస్సీ హాస్టళ్లలో సిబ్బంది కొరత
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖలో నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిలో 20మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఐఎఫ్ఎంఐఎస్లో వివరాల నమోదు సందర్భంగా.. రాష్ట్ర అధికారులు కేటాయించిన పోస్టుల సంఖ్య తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లా అధికారుల అభ్యర్థన మేరకు పోస్టుల సంఖ్య పెంచకపోతే, ఈ సిబ్బందిని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదేజరిగితే వసతిగృహాల నిర్వహణపై తీవ్ర ప్రభా వం చూపనుంది.
ఉద్యోగ భద్రతపై నీలినీడలు
ప్రభుత్వం అన్నిశాఖల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖలో పనిచేస్తున్న మొత్తం 82 మంది నాలుగో తరగతి ఔట్సోర్సింగ్ సిబ్బంది వివరాలను జిల్లా అధికారులు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఊహించని విధంగా రాష్ట్ర అధికారులు జిల్లాకు కేవలం 62 పోస్టులను మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. దీంతో మిగిలిన 20 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది భవితవ్యం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని ఎస్సీ సంక్షేమశాఖలో వివిధ వసతిగృహాలు, కార్యాలయాల్లో మొత్తం 131 మంది నాలు గో తరగతి సిబ్బంది అవసరం ఉంది. ప్రస్తుతం రెగ్యులర్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని కలిపినా ఆ సంఖ్య తక్కువగానే ఉంది. ఈ 82 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని కలుపుకుని పనులను నెట్టుకొస్తున్నారు.
జిల్లా అధికారుల లేఖ
ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తే ఎస్సీ వసతిగృహాల్లో సిబ్బంది కొరత తీవ్రమై నిర్వహణ సమస్యలు తలెత్తుతాయని జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. అనుమతులు, అవసరం మేర సిబ్బందిని నియమించుకున్నామని, వారితో నాలుగేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా పని చేయించుకుంటూ వస్తున్నామని, ఇప్పుడు వారిని తొలగిస్తే సిబ్బంది లేక వసతిగృహాల నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఆ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. జిల్లాకు కేటాయించిన పోస్టుల సంఖ్యను పెంచి, ప్రస్తుతం పనిచేస్తున్న 82మంది సిబ్బందిని విధుల్లో కొనసాగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో స్పష్టంగా కోరినట్లు సమాచారం. రాష్ట్ర అధికారులు ఈ లేఖపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో త్వరగా స్పందించి న్యాయం చేయాలని బాధిత సిబ్బంది వేడుకుంటున్నారు. దీనిపై ఎస్సీ సంక్షేమశాఖ అధికారులను వివరణ కోరగా.. 82 మంది సిబ్బందిని కొనసాగించాలని రాష్ట్ర అధికారులను కోరామని, 10 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారని, సిబ్బందికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర అధికారులు 62 మందిని మాత్రమే నియమించుకునేందుకు అనుమతులు ఉన్నాయని, ఆ ప్రకా రమే ఐఎఫ్ఎంఐఎస్లో వివరాలు నమోదు చేయా లని స్పష్టం చేయడంతో జిల్లా అధికారులు ఆందో ళనకు గురయ్యారు. నాలుగేళ్లకు పైగా కష్టపడి ఇదే శాఖలో పనిచేస్తున్న సిబ్బందిని ఒక్కసారిగా తొలగిస్తే వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఉద్యోగాలు కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అధికారుల చర్యలతో సిబ్బంది భవితవ్యం అయోమయ స్థితిలో ఉంది.


