
ఎదురెదురుగా బస్సు, ఆటో ఢీ
కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల క్రాస్ సమీపాన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... మహబూబాబాద్ జిల్లా గార్ల నుంచి లింగాల మీదుగా ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఖమ్మం నుంచి నలుగురు ప్రయాణికులతో ఇల్లెందు వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సలీంతో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ మహబూబ్, హలీమా, సోందుబీ, జర్పుల కమలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎస్సై సాయికుమార్, సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన షేక్ సోందుబీ(68) మృతి చెందింది. అలాగే చికిత్స చేయిస్తుండగా గాదెపాడుకు చెందిన అంగన్వాడీ టీచర్ షేక్ మహబూబ్(48) కన్నుమూసింది. అంతేకాక అలాగే, సలీం(ఇల్లెందు) పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, కమల(గాదెపాడు)కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డా డు. మండలంలోని కాకర్లపల్లికి చెందిన మట్టా మురళీకృష్ణ(45) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నాక ఫలితం లేక శుక్రవారం రాత్రి ఆయన పురుగుల మందు తాగగా ప్రభుత్వాస్పత్రి తరలించా రు. అక్కడే చికిత్సపొందుతూ మృతిచెందాడు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేజీ గంజాయి స్వాధీనం
తిరుమలాయపాలెం: ఒడిశా నుంచి గంజాయి తీసుకొస్తున్న ఓ వ్యక్తిని శనివారం తిరుమలాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గ్యామాతండాకు చెందిన ఆటో డ్రైవర్ లూనావత్ ప్రవీణ్కుమార్ అలియాస్ తాజ్ ఒడిశా నుండి మోటార్ సైకిల్పై కేజీ గంజాయితో వెళ్తున్నాడు. ఈక్రమాన తిరుమలాయపాలెం సమీపాన కొక్కిరేణి స్టేజీ వద్ద ఎస్ఐ కూచిపూడి జగదీష్ ఆధ్వర్యాన వాహనాల తనిఖీ చేస్తుండగా తాజ్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన వద్ద పరిశీలించగా కేజీకి పైగా ఎండు గంజాయి లభించింది. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం