
కార్మికచట్టాల రక్షణకు పోరాటం
● జూలై 9న జాతీయ సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలి ● ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా రవాణా రంగంతో పాటు కార్మిక చట్టాలను కాపాడుకునేలా ప్రజా ఉద్యమాలకు రూపకల్పన జరగాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య(ఏఐఆర్డబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య అన్నారు. ఇందుకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) మహాసభలు వేదికగా నిలవాలని సూచించారు. ఖమ్మంలో శనివారం ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు మొదలుకాగా, రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు జెండా ఆవిష్కరించాక అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూనే సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేయాలని సూచించారు. వచ్చేనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికవర్గం పాల్గొని నిరసన తెలపాలని కోరారు. వివిధ సంఘాల నాయకులు అశ్వద్ధామరెడ్డి, పాటి అప్పారావు, థామస్రెడ్డి, బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తామని ప్రకటించారు. ఈసమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.ఎస్.రావుతో పాటు కళ్యాణం వెంకటేశ్వరరావు, పి.శ్రీకాంత్, సీహెచ్.సుందరయ్య, ఎంఎన్.రెడ్డి, రాములు, ఎంవీఎస్ఎస్.నారాయణ, గుండు మాధవరావు, గడ్డం లింగమూర్తి, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, పద్మావతి, పి.రవీందర్రెడ్డి, బిక్షపతిగౌడ్, బత్తుల సుధాకర్, పిట్టల సుధాకర్, విక్రం, జిల్లా ఉపేందర్, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.