సాహిత్యంలో ధిక్కార స్వరాలు | - | Sakshi
Sakshi News home page

సాహిత్యంలో ధిక్కార స్వరాలు

Jun 22 2025 4:00 AM | Updated on Jun 22 2025 4:00 AM

సాహిత్యంలో ధిక్కార స్వరాలు

సాహిత్యంలో ధిక్కార స్వరాలు

● రచనలతో చైతన్యపరిచిన దాశరథి, ఆరుద్ర ● జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఘంటా చక్రపాణి

ఖమ్మం సహకారనగర్‌: సామాజిక పరిణామాలపైనే కాక స్వాతంత్య్రానంతరం దేశంలోని మార్పులపై తమ సాహిత్యం, రచనల ద్వారా దాశరథి, ఆరుద్ర ధిక్కార స్వరం వినిపించారని డాక్టర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అన్నారు. అంతేకాక తమదైన రచనా శైలితో ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన ‘శతజయంతి సాహితీమూర్తులు – దాశరథి, ఆరుద్ర జీవితం – సాహిత్యం’పై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకీరుల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చక్రపాణి మాట్లాడుతూ దాశరథి తెలంగాణ జీవన స్వరమన్నారు. ఖమ్మంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన పాదముద్రలు పడిన ఖమ్మంలో శతజయంతి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన సాహిత్యం, పాటలు ఉత్తేజం, స్ఫూర్తిని కలిగించాయన్నారు. ఇక ఆరుద్ర గొప్ప పరిశోధకుడిగా, కవిత్వంలో ప్రయోగాలకు ఆధునికుడిలా నిలిచారని తెలిపారు. సీనియర్‌ సంపాదకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం, నిజాం నిరంకుశ పాలన కాలపు బడుగుల కన్నీళ్లను అక్షరబద్ధం చేశారన్నారు. స్వీయ అనుభవాలు, సామాజిక పరిణామాలు దాశరథి ప్రతీ రచనలో కనిపిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ పూర్వ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ ఖమ్మం సాహిత్య గుమ్మం అని, ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సు చరిత్ర పుటల్లో నిలుస్తుందని చెప్పారు. అనంతరం బీసీ కమిషన్‌ పూర్వ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ మాట్లాడుతూ ఈ తరం విద్యార్థులు దాశరథి, ఆరుద్రల సాహిత్య సారాంశాన్ని తప్పక అధ్యయనం చేయాలని సూచించారు. సాహిత్య విశ్లేషకులు ఎన్‌.వేణుగోపాల్‌ మాట్లాడుతూ దాశరథి తెలంగాణకు సాహిత్య దీపదారిగా నిలవడమేకాక తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపారని వెల్లడించారు. స్వామి రామానందతీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ ఎన్‌.కిషోర్‌రెడ్డి, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భూక్యా భాంగ్యా, సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ పి.రవికుమార్‌ మాట్లాడగా డాక్టర్‌ సీతారాం, రవిమారుత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement