
వన మహోత్సవానికి సిద్ధం
● 571 నర్సరీల్లో 25లక్షల మొక్కలు రెడీ ● ఈసారి 3.50 లక్షల తాటి, ఈత మొక్కలు ప్రత్యేకం ● ప్రభుత్వ ఆదేశాలు రాగానే ప్రారంభం
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవానికి సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యాన నర్సరీల్లో మొక్కలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈసారి పర్యావరణ పరిరక్షణతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాటి, ఈత మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. జిల్లాలోని 20మండలాల్లో 571 నర్సరీల్లో 25 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 3.50 లక్షల తాటి, ఈత మొక్కలు సిద్దం చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాల అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షలో తాటి, ఈత మొక్కల పెంపకంపై చేసిన సూచనలతో అధికారులు జిల్లాలో లక్ష్యం మేరకు నాటాలని నిర్ణయించారు.
పర్యావరణం.. జీవనోపాధి
గతంలో హరితహారం, వన మహోత్సవంలో నీడనిచ్చే మొక్కలతో పాటు పూలు, పండ్లు, మూలికల మొక్కలే నాటారు. ఈసారి తాటి, ఈత మొక్కలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మొక్కలు నేల కోతను సమర్థవంతంగా అరికట్టి భూగర్భ జలాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాతావరణ సమతుల్యత కాపాడడమే కాక కార్బన్ డై ఆకై ్సడ్ను తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. తాటి, ఈత చెట్లు దీర్ఘకాలం జీవిస్తూ పర్యావరణ పరిరక్షణకే కాక ఉపాధికి ఊతమిస్తాయి. వీటి నుంచి లభించే కల్లు, తాటి బెల్లం, ఈత పళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పలువురికి జీవనోపాధిని కల్పిస్తాయి.
ప్రణాళికాయుతంగా నిర్వహణ
వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో డీఆర్డీఏ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేలా అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంగణాలు, గ్రామీణ రోడ్ల పక్కన ఖాళీ స్థలాలే కాక సామూహిక భూములను ఎంపిక చేస్తున్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేలా అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేయడం, క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ప్రతీ మొక్కను బతికించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
హరిత స్ఫూర్తితో ముందుకు..
వన మహోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగానే కాక జిల్లా వాసుల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా కనీసం ఒక మొక్క అయినా నాటి సంరక్షించాలని కోరుతున్నారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల బాధ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా కార్యాచరణ రూపొందించారు. పచ్చదనం పెంచడం వ్యక్తిగత కృషి మాత్రమే కాక సామాజిక బాధ్యత కూడా అని అవగాహన కల్పించనున్నారు.