
భూభారతీ.. భారం మీదే
జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చిన మండలాలు
మండలం దరఖాస్తులు
కారేపల్లి 6,114
కొణిజర్ల 5,539
ఏన్కూరు 4,994
కల్లూరు 4,866
పెనుబల్లి 4,653
తల్లాడ 4,567
కామేపల్లి 4,527
కూసుమంచి 3,877
వేంసూరు 3,830
రఘునాథపాలెం 3,534
వైరా 3,344
తిరుమలాయపాలెం 3,097
ఎర్రుపాలెం 3,040
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా ఈనెల 3నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారం ముగిశాయి. అధికారులు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో సమస్యల పరిష్కారం కోసం రైతులు 67,378 దరఖాస్తులు అందజేశారు. తొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో కలిపి 6,085 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా మొత్తం 73,463 దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అయితే, నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో అందిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం ఇప్పటికే కొనసాగుతోంది. మిగిలిన మండలాల్లో అందిన ఆర్జీలపై త్వరలోనే దృష్టి సారించనున్నారు. అయితే, మొత్తంగా అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే ఉండడం విశేషం.
ఆ రెండు మండలాల్లో తొలుత..
భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన పైలట్ మండలాల్లో నేలకొండపల్లి కూడా ఉంది. దీంతో ఈ మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా 3,224 మంది రైతులు దరఖాస్తులు ఇచ్చారు. రెండో విడతలో బోనకల్ మండలాన్ని ఎంపిక చేయగా ఇక్కడ 2,861 దరఖాస్తులు వచ్చాయి. రెండు మండలాల్లో సాదాబైనామాపైనే దరఖాస్తులు ఎక్కువగా అందాయి. వీటిని పక్కన పెట్టి మిగతా దరఖాస్తులకు సంబంధించి నేలకొండపల్లి మండలంలో 354 పరిష్కరించగా, బోనకల్ మండలంలోనూ క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతోంది.
తుది నిర్ణయం వచ్చాకే..
రైతులు వివిధ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వగా అత్యధికంగా 40,872 దరఖాస్తులు సాదాబైనామాలపైనే రావడం గమనార్హం. ఇక సర్వేనంబర్లు తప్పుగా నమోదయ్యాయని 4,390, మ్యుటేషన్ కోసం 956 దరఖాస్తులు ఇచ్చారు. అలాగే, పాస్ పుస్తకాల్లో పట్టేదారు వివరాల నమోదుకు 187, ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగింపునకు 355 దరఖాస్తులు వచ్చాయి. అయితే, సాదా బైనామాలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉండడంతో అధికారులు వీటి పరిశీలన మొదలుపెట్టలేదు. దీంతో రైతులు ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
పరిశీలనకు కసరత్తు
జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో అందిన దరఖా స్తులను ఆన్లైన్లో నమోదు చేసి పరిశీలించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో ఆన్లైన్ నమోదు ప్రక్రియ ముగి యగా పరిశీలన, పరిష్కారం ఊపందుకున్నాయి. మిగిలిన మండలాల్లోనూ అధికారులు సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాక పరిష్కా రంపై దృష్టి సారించనున్నారు. ఓసారి నిర్ణయం వెలు వరించాక భవిష్యత్లో మరోసారి వివాదం, ఘర్షణ జరగొద్దనే భావనతోనే పకడ్బందీగా పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తుల ఆన్లైన్, పరిశీలనపై అధికారుల దృష్టి
నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహణ
మిగతా 19మండలాల్లో
67,378 దరఖాస్తుల స్వీకరణ
సాదాబైనామా కోసం
అత్యధికంగా 40,872..
19 మండలాలు..339 గ్రామాలు
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రెండు మండలాలు మినహా మిగిలిన 19 మండలాల్లో ఈనెల 3 నుంచి భూభారతి చట్టం అమలు ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల్లో శుక్రవారం వరకు కొనసాగాయి. అధికారుల బృందం 339 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూభారతి చట్టంతో ఉపయోగాలు, రైతుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో అవగాహన కల్పించారు. దీంతో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు వెల్లువలా 67వేలకు పైగా దరఖాస్తులు సమర్పించగా అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.