శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం

Jun 22 2025 4:00 AM | Updated on Jun 22 2025 4:00 AM

శ్రీవారికి అభిషేకం,  నిత్యకల్యాణం

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూల విరాట్‌తో పాటు శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్‌ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాలు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్‌ మండలాల పరిధిలో రోడ్ల విస్తరణ, బీటీ రోడ్లు నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పర్యటనకు మంత్రి పొంగులేటి బయలుదేరతారు.

26న డాక్‌ అదాలత్‌

ఖమ్మంగాంధీచౌక్‌: తపాలా సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు ఈనెల 26వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో డాక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వీరభద్రస్వామి తెలిపారు. ఖమ్మం డివిజన్‌ పరిధిలోని తపాలా సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఫిర్యాదులను ఈనెల 24వ తేదీలోగా ‘డాక్‌ అదాలత్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌, ఖమ్మం డివిజన్‌, ఖమ్మం–507003’ చిరునామాకు పంపించాలని సూచించారు. ఫిర్యాదుతో పాటు మొబైల్‌ నంబర్‌ లేదా ఈ మెయిల్‌ జత చేస్తే, అదాలత్‌ సమయాన వారిని లింక్‌ చేసి సమస్యను చర్చిస్తామని తెలిపారు.

డిగ్రీ సీట్ల భర్తీకి

స్పాట్‌ కౌన్సెలింగ్‌

రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని మహా త్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కాలేజీలో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 25న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపా రు. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో సీట్లను రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయనుండగా 25న ఉదయం 11గంటలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ మొదలవుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఎస్సెస్సీ, ఇంటర్‌ మెమో, టీసీ, కుల, ఆదా య, ఫిట్‌నెస్‌, స్థానికత ధ్రువపత్రాలతో పాటు పది పాస్‌పోర్ట్‌ సైట్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. వివరాలకు 99639 30931, 70326 32863 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

యూపీఎస్సీ శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్‌: యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనుండగా, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రతులను ‘డైరెక్టర్‌, టీజీఎస్సీ స్టడీ సర్కిల్‌, రోడ్డు నంబర్‌ 14, కేబీఆర్‌ పార్కు ఎదుట, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌’ చిరునామాలో వచ్చేనెల 7లోగా అందజేయాలని సూచించారు. వచ్చేనెల 13న ఇంగ్లిష్‌ మీడియంలో నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 040–23546552, 81216 26432, 90320 77276 నంబర్లలో సంప్రదించాలని డీడీ సూచించారు.

9ఎకరాల వరకు

పెట్టుబడి సాయం జమ

ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రపభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా శనివారం నాటికి తొమ్మిది ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయింది. జిల్లాలో 3,53,794 మంది రైతులను అర్హులుగా గుర్తించగా, రూ. 436,84,65,365 అందాల్సి ఉంది. ఇందులో శనివారం నాటికి 3,20,105 మంది రైతుల ఖాతాల్లో రూ.347,18,42,096 జమ అయ్యాయని డీఏఓ పుల్లయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement