
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రక్తంగా జరిపించారు.
ఈ – టికెట్లపై భక్తులకు అవగాహన
భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు దర్శనం, ప్రసాదాలు ఇతర సేవలకు గాను రామాలయంలో ఏర్పాటు చేసిన మిషన్లపై ఈఓ ఎల్.రమాదేవి శనివారం భక్తులకు అవగాహన కల్పించారు. తొలుత ఈ మిషన్లకు పూజలు నిర్వహించాక యంత్రాల్లో ఉన్న సదుపాయాలు, ఈ టికెట్లు పొందే విధానం గురించి వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. భక్తులు సైతం ఈ టికెట్లు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీందర్, ఏఈఓ భవాని రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.