
బడిలో సెల్కు చెల్లు
● తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్ మాట్లాడొద్దు ● స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ● పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిర్ణయం
వైరా: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదిలో సెల్ఫోన్ మాట్లాడడం నిషేధం. ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం కొద్దిరోజుల క్రితం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తరగతి గదిలో ఉన్న సమయాన సెల్ఫోన్లో మాట్లాడితే చర్యలు ఉంటాయని అందులో వెల్లడించింది. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఫోన్లు మాట్లాడడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిపుణుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఉపాధ్యాయులు స్వీయ నియంత్రణ పాటిస్తూ సెల్ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని సూచించింది.
సమయం వృథా కాకుండా..
తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్ మాట్లాడడం ద్వారా సమయం వృథా అవుతుందని, విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతింటుందని చెబుతున్నారు. అంతేకాక ఫోన్లో మాట్లాడగానే అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు వెంటనే పాఠ్యాంశంలో నిమగ్నం కావడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. ఈ విషయమై విద్యావేత్తల నుంచి అందిన సమాచారంతో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా, ఉపాధ్యాయులు తరగతి గదిలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకో వాలి. రాగానే స్టాఫ్రూమ్లో పెట్టడం.. విరామ సమయాల్లోనూ చూసేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
కఠిన చర్యలు తీసుకుంటాం..
ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దు. పాఠం మధ్యలో ఫోన్ మాట్లాడినట్లు తేలితే చర్యలు తప్పవు. స్కూల్కు ఫోన్ తీసుకొచ్చినా హెచ్ఎంకు అప్పగించాలి. మధ్యలో వినియోగిస్తే బోధనలో ఏకాగ్రత దెబ్బతింటుంది.
– సామినేని సత్యనారాయణ,
జిల్లా విద్యాశాఖాధికారి
ప్రభుత్వ నిర్ణయం మంచిదే..
ప్రభుత్వ ఉపాధ్యాయులు పనివేళల్లో సెల్ఫోన్ వాడకుండా తీసుకున్న నిర్ణయం మంచిదే. తద్వారా విద్యార్థులు, బోధనకు పూర్తి సమయాన్ని కేటాయించొచ్చు. విద్యార్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. – దొడ్డా వరప్రసాద్,
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

బడిలో సెల్కు చెల్లు

బడిలో సెల్కు చెల్లు