
లాకులకు లీకులు..
● పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని గేట్లు ● నిధులున్నా టెండర్లకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు ● కిన్నెరసాని ప్రాజెక్ట్కు పొంచి ఉన్న ముప్పు ● ప్రమాదమేమీ లేదని కొట్టిపారేస్తున్న జెన్కో అధికారులు
మూడుసార్లు టెండర్లు పిలిచాం..
కిన్నెరసాని గేట్ల మరమ్మతుల కోసం రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గత నెల 6న, 22న, ఈ నెల 3న... మూ డు సార్లు టెండర్లు పిలిచాం. కానీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందురావడంలేదు. డ్యామ్లో నీటిమట్టం 393 అడుగులు ఉంటేనే మరమ్మతులు చేసే అవకాశంఉంటుంది. గేట్ల మధ్య సీల్స్ ఏర్పాటు, రోప్ మార్పు, పెయింటింగ్ పనులు నిర్వహిస్తాం. డ్యామ్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. – ప్రభాకర్రావు, కేటీపీఎస్ 5వ దశ సీఈ
పాల్వంచరూరల్: పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చడంతోపాటు తాగు, సాగునీరు అందించే కిన్నెరసాని ప్రాజెక్ట్కు ప్రమాదం పొంచిఉంది. పదేళ్లుగా ప్రాజెక్ట్ గేట్లు(లాకులు) మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో గేట్ల మధ్య లీకులు ఏర్పడి జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. రెండు, మూడేళ్లుగా గేట్ల రబ్బర్ సీల్స్ లీకై నీళ్లు బయటకు వస్తున్నాయి. లీకేజీ చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు, పరీవాహక ప్రాంతాల ప్రజ లు పేర్కొంటున్నారు. గేట్లకు సంబంధించిన పిల్ల ర్లు కూడా దెబ్బతింటున్నాయి. మరమ్మతులకు అవసరమైన నిధులున్నా పనులు చేపట్టడంలేదు. ప్రా జెక్ట్ నిర్వహణ చూస్తున్న జెన్కో (కేటీపీఎస్) అధి కారులు మేల్కొనకపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు
కిన్నెరసాని రిజర్వాయర్ నిర్మాణం 1962లో ప్రారంభించి 1972లో పూర్తిచేశారు. 13క్రస్ట్గేట్లతో 407 అడుగుల గరిష్ట నీటిమట్టంతో 8.4 టీఎంసీల నిల్వసామర్థ్యంతో జలాశయం నిర్మిం చారు. తొలుత ప్రాజెక్ట్ను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షించగా, 1998 ఏప్రిల్ 1 నుంచి జెన్ కో పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మించి ఆరు దశాబ్దాలు గడుస్తుండగా మధ్యలో జెన్కో అధికారులు కరకట్టను పటిష్టపరిచే పనులు చేపట్టారు. 2014లో రూ.60 లక్షలతో 13 క్రస్ట్ గేట్లకు రోప్ వే, సాకెట్లను మార్చారు. దీంతో వీటిని మరో పదేళ్లు మార్చాల్సిన అవసరం లేదు. కాగా కిన్నెరసాని జలాశయం విస్తీర్ణం 515 చదరపు మీటర్లు, డ్యామ్ ఎత్తు 39మీటర్లు, పొడవు 2.4 కిలోమీటర్లుగా ఉంది. కేటీపీఎస్లో విద్యుదుత్పత్తికి, ఎన్ఎండీసీ, నవభారత్, కర్మాగారాలకు కిన్నెరసాని నీరు సరఫరా చేస్తారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు తాగునీరు ఇక్కడి నుంచే వెళ్తుంది. పాల్వంచ మండలంలో మూడు వేలు, బూ ర్గంపాడు మండలంలో 7వేల ఎకరాల భూమికి సాగునీరు కూడా అందిస్తోంది.
పదేళ్ల క్రితం మరమ్మతులు
గేట్లకు పదేళ్లక్రితం మరమ్మతులు నిర్వహించారు. నా లుగైదు ఏళ్లకోసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా జెన్కో అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్లోని నీటిమట్టం 393 అడుగుల లోపు ఉంటేనే మరమ్మతు పనులు చేపట్టేందుకు వీలవుతుంది. అంతకంటే ఎక్కువగా పెరిగితే పనులు సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఒకటోగేటు నుంచి నాలుగో గేటు వరకు, 13వ నంబర్ గేట మధ్య పిల్లర్లకు బీటలు వారాయి. దీంతో పిల్లర్ల మధ్య నీటి చెమ్మ అధికంగా కన్పిస్తోంది. గేట్ల మధ్య రబ్బర్ సీల్స్ కూడా లీకవుతుండటంతో రిజర్వాయర్ నుంచి నీరు వృథాగాపోతోంది. అయితే ఈ లీకులతో ప్రమాదమేమీ లేదని కేటీపీఎస్ అధికారులు చెబుతున్నా రు. రిజర్వాయర్లోనీటిమట్టం 400అడుగులకు మిం చి పెరిగినప్పుడే బీటలనుంచి నీళ్లు బయటకు వస్తుందని పేర్కొంటున్నారు. పరీవాహక గ్రామాల ప్రజ లు, ఆయకట్టు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే మరమ్మతులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం జరిగే అవకాశముందనిఆవేదన చెందుతున్నారు. కాగా పిల్లర్ల మరమ్మతులు, ఇతర పనులకు ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకం డ్రిప్ ఇరిగేషన్ కింద రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.
కట్ట పటిష్టతకు రూ.1.90 కోట్లు
కిన్నెరసాని జలాశయం కరకట్ట పటిష్టతకు రూ.1.90కోట్లు, గేట్ల మరమ్మతులకు రూ.1.20 కోట్లను జెన్కో మంజూరు చేసింది. పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీడబ్ల్యూపీఆర్ఎస్) నుంచి నిపుణులు వచ్చి అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాకే పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులతోపాటు భవిష్యత్లో ఎదురయ్యే పరిణామాలను తట్టుకునేలా నిపుణులు అధ్యయనం చేసి సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. ఇక గేట్ల మరమ్మతులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది.

లాకులకు లీకులు..