
సన్నగా సర్దేస్తున్నారు
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం కొద్దినెలలుగా సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండడం అక్రమార్కులకు అవకాశంగా మారింది. కొందరు డీలర్లు, వ్యాపారులు ముఠాగా ఏర్పడి బియ్యాన్ని అధిక ధరలతో ఇతర
ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క లబ్ధిదారులు కూడా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన సమయాన సాగిన అక్రమాలు ఇప్పుడు ఆగకపోగా..
పౌర సరఫరాల శాఖ అధికారులు నిఘా నేత్రాన్ని దాటి అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
ఏళ్లుగా వేళ్లూనుకుని..
రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరించింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అయితే, దొడ్డు బియ్యం పంపిణీ సమయాన లబ్ధిదారులు తినలేక.. డీలర్లు, ఇతరులకు అమ్మేవారు. ఇక కొందరు వ్యాపారులు రేషన్ షాప్ల్లో మిగిలిన, లబ్ధిదారుల వద్ద సేకరించిన బియ్యాన్ని ప్రాసెస్ చేయించి అధిక ధరకు విక్రయించేవారు. కొందరు బడా వ్యాపారులు.. మిల్లర్లు, ఇతరుల నుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం సేకరించి పాలిష్ చేయించాక విదేశాలకు ఎగుమతి చేశారు. కొన్ని సందర్భాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు బియ్యం లారీలను పట్టుకున్నా దందా మాత్రం ఆగలేదు.
సన్న బియ్యంతో చెక్ పెట్టాలని..
గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా వాటిని తినేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. మధ్య తరగతి ప్రజలైతే బియ్యం అసలే తీసుకోలేదు. ఇదే అదునుగా బడా వ్యాపారుల జేబులు నింపుకున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు కచ్చితంగా తింటారనే భావనతో ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. తొలి నెలలో బియ్యాన్ని లబ్ధిదారులు అధిక సంఖ్యలో తీసుకెళ్లి తినడానికి వీలుగా ఉన్నాయని తెలిపారు. తద్వారా అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని పౌర సరఫరాల శాఖ అధికారులు భావించారు.
కఠిన చర్యలు తీసుకుంటేనే..
సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడమే కాక లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేయడమే కాక రేషన్కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే బియ్యం అమ్మిన, కొనుగోలు చేసిన వారిపైనా కేసులు పెడతామని చెబుతున్నారు. ఈక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. అయితే, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు రేషన్షాప్లపైనా నిఘా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.
అక్రమంగా కొనుగోళ్లు,
తరలింపు
వ్యాపారులకు సహకరిస్తున్న
కొందరు డీలర్లు
అడ్డూఅదుపు లేకుండా
సాగుతున్న వ్యాపారం
తనిఖీలు ముమ్మరం చేస్తున్న
పౌర సరఫరాల శాఖ