వాడీవేడిగా డీసీసీబీ మహాజన సభ | - | Sakshi
Sakshi News home page

వాడీవేడిగా డీసీసీబీ మహాజన సభ

Jun 21 2025 3:37 AM | Updated on Jun 21 2025 3:37 AM

వాడీవేడిగా డీసీసీబీ మహాజన సభ

వాడీవేడిగా డీసీసీబీ మహాజన సభ

● మినిట్స్‌ బుక్‌ లేకపోవడంపై సభ్యుల మండిపాటు ● డిపాజిట్లు, ఇతర అంశాలపై ప్రశ్నల వర్షం

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) 127వ మహాజన సభ వాడీవేడిగా సాగింది. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించగా, తొలుత వార్షిక నివేదిక ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా సహకార సంఘాల చైర్మన్లు పలువురు తీర్మానాలను మినిట్స్‌ బుక్‌లో రాయాలని సూచించగా.. అధికారులు బుక్‌ తీసుకురాలేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాజన సభకు మినిట్స్‌ బుక్‌ లేకుండా హాజరుకావడం ఏమిటంటూ సమోసాలు, టీ కోసం వచ్చామా అని ప్రశ్నించారు. కాగా, 2007–08లో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారి నుంచి రూ.90 కోట్లు డిపాజిట్లు సేకరిస్తే, ఆ డిపాజిట్ల చెల్లింపుపై గత సభలో చేసిన తీర్మానం అమలుకు నోచుకోలేదని పలువురు తెలిపారు. వడ్డీ కలిపి రైతులకు చెల్లించాల్సి ఉందని చెప్పడంతో త్వరలోనే చెల్లిస్తామని బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్య బదులిచ్చారు. కాగా, పీఏసీఎస్‌లు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో డీసీఎంఎస్‌, ఇతర సంస్థల ద్వారా ధాన్యం కొనుగోలుపై అవకాశం కల్పించటం సరికాదని పేర్కొన్నారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల సమయాన నియమించే సిబ్బంది వేతనాల విషయమై ప్రశ్నించగా కమీషన్‌ నుంచి వేతనాలు చెల్లించవచ్చని జిల్లా సహకార అధికారి గంగాధర్‌ తెలిపారు. అలాగే, బ్యాంకు రుణాల నుంచి వసూలు చేసే వాటాధనంలో సహకార సంఘాలకు భాగం ఇచ్చేలా తీర్మానానికి పలువురు పట్టుబట్టారు. అంతేకాక 2023 నుంచి మొక్కజొన్నల కొనుగోళ్లపై రూ.లక్షల్లో రావాల్సిన కమీషన్‌ చెల్లించాలని కోరగా రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ సమావేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మార్క్‌ఫెడ్‌ జీఎం సునీత తెలిపారు. ఇంకా భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఎరువుల స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు, సహకార సంఘాల ఉద్యోగుల బదిలీలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, బ్యాంకు డైరెక్టర్లు గొర్ల సంజీవరెడ్డి, లక్కినేని సురేందర్‌రావు, లక్ష్మణ్‌రావు, ప్రసాద్‌, సైదులు, డీఆర్‌డీఓ అవధానుల శ్రీనివాసరావు, అధికారులు, పీఏసీఎస్‌ల చైర్మన్లు పాల్గొన్నారు.

సభ్యులకు బీమా పెంపు

పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకునే సభ్యులకు గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పరిమితిని పెంచుతూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న బీమా పరిమితిని రూ.లక్షకు పెంచారు. అలాగే, 2024–25లో బ్యాంకు గడించిన లాభాల్లో రూ.530.55 కోట్లను సహకార సంఘాలకు డివిడెంట్‌(ఆరు శాతం)గా చెల్లించాలని నిర్ణయించింది. అంతేకాక ఉద్యోగులకు 8–12 శాతం(దూరం ఆధారంగా) అలవెన్స్‌ చెల్లింపునకు నిర్ణయించారు.

అక్రమాలపై విచారణకు నిర్ణయం

ఇళ్ల స్థలాలకు సంబంధించి నకిలీ ధ్రువ పత్రాలు సమర్పించి రూ.6 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంపై విచారణ

చేపట్టాలని డీసీసీబీ పాలకవర్గం

నిర్ణయించింది. మహాజన సభకు ముందుగా బ్యాంకు పాలకవర్గ సమావేశం జరగగా ఈ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించారు. దీంతో బ్యాంకు సొమ్మును పక్కదారి

పట్టించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా విచారణకు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement