
మేరునగధీరులు.. దాశరథి, ఆరుద్ర
ఖమ్మం సహకారనగర్: తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన దాశరథి, ఆరుద్ర తెలుగు సాహిత్య చరిత్రలో మేరునగధీరులుగా నిలిచారని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన ‘శతజయంతి సాహితీమూర్తులు’ పేరిట దాశరథి – ఆరుద్రజీవితం సాహిత్యంపై నిర్వహించే రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్. ఎన్.శాస్త్రి అధ్యక్షత వహించగా దాశరథి, ఆరుద్ర చిత్రపటాల వద్ద నివాళులర్పించాక వీసీ సూర్య ధనుంజయ్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ పీడిత ప్రజల పక్షాన నిలిచి అక్షరమే ఆయుధంగా పోరాడిన యోధుడిగా దాశరథి తిమిరంతో సమరం చేశారని చెప్పారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడిన బడుగు వర్గాలకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఇక ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య పరిశోధనతో చరిత్రను లోతుగా అధ్యయనం చేసి అరుదైన పరిశోధకుడిగా నిలిచారని కొనియాడారు. నేటి యువత వీరిద్దరి సాహిత్యంపై అధ్యయనం చేయాలని సూచించారు. అనంతరం దాశరథి, ఆరుద్ర సాహిత్యంపై ఓయూ తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, సాహిత్య విమర్శకులు కవి రెంటాల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. ఈకార్యక్రమంలో కేయూ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రా రాజుతో పాటు రవిమారుత్, ప్రసేన్, బానోత్ రెడ్డి, డాక్టర్ సునంద, డాక్టర్ పి.రవికుమార్, డాక్టర్ సీతారాం, డాక్టర్ జె.అనురాధ, కిరణ్కుమార్, డాక్టర్ ఎం.వీ.రమణ, డాక్టర్ కార్తీక్, కోటమ్మ, శ్రీ నివాస్ మాట్లాడగా వివిధ ప్రాంతాల అధ్యాపకులు 30మంది పత్రాలు సమర్పించారు.
జాతీయ సదస్సులో వక్తలు