మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

Jun 21 2025 3:37 AM | Updated on Jun 21 2025 3:37 AM

మాదకద

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

ఖమ్మంక్రైం: మాదక ద్రవ్యాల వినియోగంతో నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సమూలంగా నిర్మించడమే లక్ష్యంగా పోలీసులు అధికారులు కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈనెల 26వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా స్థాయిల్లో అవగాహన సదస్సులతో పాటు యోగా, ధ్యానం, ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, పోటీలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈమేరకు ఖమ్మం కమిషనరేట్‌లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను సీపీ సునీల్‌దత్‌ వివరించారు. ఇంకా ఈ వీసీలో అడిషనల్‌ డీసీపీ ప్రసాద్‌రావు, సీఐ స్వామి పాల్గొన్నారు.

టీకాలతోనే ఆరోగ్య సంరక్షణ

ఖమ్మంవైద్యవిభాగం: మిషన్‌ ఇంద్రధనస్సు ద్వారా జిల్లాలో వంద శాతం గర్భిణులు, 0–5ఏళ్ల చిన్నారులకు టీకాలు వేయాలని, తద్వారా ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ చంద్రూనాయక్‌ తెలిపారు. మిషన్‌ ఇంద్రధనస్సు, యోగా డే, డయేరియా నియంత్రణ కార్యక్రమాలపై శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు మిషన్‌ ఇంద్రధనస్సు ద్వారా గర్భిణులు, చిన్నారులను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి టీకాలతో ప్రయోజనాలను వివరించాలని సూచించారు. అలాగే, డయేరియా నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలని, చిన్నారులకు ఓఆర్‌ఎస్‌, జింక్‌ టాబ్లెట్లు అందించాలని తెలిపారు. కాగా, యోగా డే సందర్భంగా శనివారం ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని డీఐఓ సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌ అధికారి డాక్టర్‌ రామారావు, అదనపు డీఎంహెచ్‌ఓ బిందుశ్రీ, డీ.వీ.ఎల్‌ ఎం.రమణ తదితరులు పాల్గొన్నారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం(బీఏఎస్‌) ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను శుక్రవారం ఖమ్మంలోని డీపీఆర్‌సీ హాల్‌లో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ బీఏఎస్‌లో సీటు రాని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, సంక్షేమ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ బీఏఎస్‌ పథకం ద్వారా ఒకటో తరగతిలో డే స్కాలర్లుగా 343దరఖాస్తులు అందగా 131 మందిని, ఐదో తరగతి(రెసిడెన్షియల్‌) ప్రవేశాలకు 219 దరఖాస్తులు అందితే 128 మందిని డ్రా ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సామినేని సత్యనారాయణ, ఎస్సీ డీడీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

స్థాయీ సంఘం

సమావేశంలో ఎంపీ

ఖమ్మంమయూరిసెంటర్‌: పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. స్థాయీ సంఘం ఆధ్వర్యాన నాలుగు రోజుల అధ్యయన యాత్ర కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్రకు చైర్మన్‌ సునీల్‌ తర్కరే అధ్యక్షత వహించగా, పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే కార్యాచరణపై చర్చించారు.

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
1
1/2

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
2
2/2

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement