
సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రామయ్యకు రూ.5 లక్షల విలువైన
బంగారు హారం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి హైదరాబాద్కు చెందిన ఎం.కృష్ణచైతన్య – రాజ్యలక్ష్మి దంపతులు గురువారం బంగారుహారం అందజేశారు. సుమారు రూ.5 లక్షల వ్యయంతో తయారు చేయించిన 52.25 గ్రాముల హారాన్ని మొదట స్వామివారి మూలమూర్తుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రమాదేవికి అందజేశారు.