
ప్రజలకు దూరంగానే కాంగ్రెస్ పాలన
● బీజేపీ వైఖరిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం ● మాస్లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు
ఖమ్మంమయూరిసెంటర్ : అనేక హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాదిన్నర పాలన కమీషన్ల మయంగా మారిందని, ఏ సంక్షేమ పథకాన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆదివారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం రేవంత్రెడ్డి పాలనపై పట్టు సాధించలేకపోయారని అన్నారు. మూడు రోజులుగా ఖమ్మంలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించామన్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వెనుక ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఉందని ఆరోపించారు. పశ్చిమాసియా దేశాలపై పెత్తనం కోసం ఇజ్రాయిల్ను అమెరికా పావుగా వాడుకుంటోందని, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దివంగత రాయల చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతిని సోమవారం ఇల్లెందులో ఏర్పాటుచేశామని, ఈ సందర్భంగా స్తూపం, పుస్తకా విష్కరణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కార్పొరేట్ శక్తులను విమానయానరంగంలోకి ప్రోత్సహించడం, కనీస భద్రతా ప్రమాణాలు పరిశీ లించకపోవడం వల్లే ఎయిర్ ఇండియా విమానానికి ఆహ్మదాబాద్లో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్, కె.రమ, కెచ్చెల రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరావు, గుర్రం అచ్చయ్య, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్ పాల్గొన్నారు.