
రైతు ప్రయోజనాలే అంతిమ లక్ష్యం
● అందుకు అనుగుణంగా విత్తన చట్టం రూపకల్పన ● రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి
ఖమ్మంవ్యవసాయం: రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా వారి సంపూర్ణ ప్రయోజనాల కోసం విత్తన చట్టం రూపొందిస్తున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి తెలిపారు. చట్టం ముసాయిదా బిల్లుపై కలెక్టరేట్లో శనివారం ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు, ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొనగా అన్వేష్రెడ్డి మాట్లాడారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతున్నందున పకడ్బందీ చట్టాలు చేసేందుకు విత్తన చట్టం ముసాయిదా బిల్లు రూపొందించామని తెలిపారు. దీనిపై అభిప్రాయాల సేకరణ కోసం ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశాల్లో వచ్చే సూచనల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి చట్టం ఖరారు చేస్తామని అన్వేష్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
ఫిర్యాదు చేయొచ్చు....
రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఆర్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రైతులు సొంతంగా విత్తనం ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో మోసపోతున్నారని తెలిపారు. ఎవరికై నా నష్టం ఎదురైతే రైతు సంక్షేమ కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. న్యాయవాది సునీల్ మాట్లాడుతూ ఒప్పందం పేరిట వ్యవసాయం జరుగుతున్నందున విత్తన నాణ్యతలో లోపాలతో రైతుకు నష్టం ఎదురైతే పరిహారం పొందే విధానం ఉండాలన్నారు. రఘునాథపాలెంకు చెందిన రైతు రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే అమ్మేలా చూస్తే నష్టపోయే పరిస్థితి ఉండదన్నారు. వైరాకు చెందిన బి.రాంబాబు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మాట్లాడగా, కొణిజర్ల ఏఓ నాగార్జున మాట్లాడుతూ విత్తన లోపాలతో నష్టపోయే రైతులకు పరిహారం అందేలా చట్టంలో పొందుపర్చాలని తెలిపారు. ఖమ్మం డీలర్ల అసోసియేషన్ ప్రతినిధి మనోహర్ మాట్లాడుతూ లైసెన్స్డ్ కంపెనీల నుంచే విత్తనాలు తెచ్చి అమ్ముతుండగా, పంట సరిగ్గా రాకపోతే డీలర్ల తప్పేం ఉంటుందని ప్రశ్నించారు. ఈమేరకు లైసెన్సింగ్ విధానంలోనే మార్పులుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీన, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయాధికారులు డి.పుల్లయ్య, వి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.