
పెరిగిన డీసీసీబీ లావాదేవీలు
● రూ.2,984 కోట్ల నుంచి రూ.3,460 కోట్లకు టర్నోవర్ ● రూ.9.64 కోట్ల లాభాల్లోకి బ్యాంకు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రగతిబాట పట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లావాదేవీలతో పాటే లాభాలూ పెరిగాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,984.31 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.3,460.70 కోట్లకు చేరింది. ఏడాది కాలంలో రుణాలు, అడ్వాన్సులు, డిపాజిట్ల రూపంలో రూ. 476.39 కోట్ల టర్నోవర్ పెరిగినట్లయింది. దీంతో 2023–24లో రూ.3.89 కోట్లుగా ఉన్న లాభాలు 2024–25 నాటికి రూ.9.64కోట్లకు చేరాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన డీసీసీబీ 100 పీఏసీఎస్లు, 50 బ్రాంచ్లతో కొనసాగుతుండగా ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. బ్యాంకు ద్వారా రైతులకు స్వల్ఫ, మధ్య, దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నారు. అన్నదాతతో పాటు వివిధ వర్గాల ప్రజలకు గృహ, మార్ట్గేజ్, వాహన రుణాలు ఇస్తుండడమే కాక బంగారం తాకట్టుపై రుణాలు కూడా జారీ చేస్తున్నారు. మరోపక్క పీఏసీఎస్ల ద్వారా ఎరువులు, పురుగు మందుల వ్యాపారం, ధాన్యం, మొక్కజొన్నలు వంటి పంట ఉత్పత్తులు కొనుగోళ్లు చేస్తుండగా ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. ఇక బ్రాంచ్ల సంఖ్యను 50 నుంచి 54కి పెంచడంపై అధికారులు దృష్టి సారించారు. కాగా, రుణాల రికవరీతో బ్యాంకు ఎన్పీఏ సైతం 1.86 నుంచి 1.27కు తగ్గడం విశేషం.
ఉద్యోగుల కృషి ఫలితంగానే ప్రగతి
డీసీసీబీ అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితంగానే బ్యాంకు ప్రగతిపథంలో సాగుతోంది. రుణాలు, డిపాజిట్లు తదితర అంశాల ద్వారా లావాదేవీలతో పాటు లాభాలూ పెరిగాయి. ఈ ప్రగతిని మరింత పెంచేలా పాలకవర్గం, ఉద్యోగుల సహకారంతో ముందుకు సాగుతాం.
– ఎన్.వెంకట్ ఆదిత్య, సీఈఓ, డీసీసీబీ

పెరిగిన డీసీసీబీ లావాదేవీలు