బనశంకరి: పారిశ్రామికవేత్తకు బెదిరింపులకు పాల్పడిన కేసులో జైలుకెళ్లి, బెయిల్పై విడుదలైన వ్యాపారవేత్త వైశాక్ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు రాజరాజేశ్వరినగర పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది.
వివరాలు.. గిరి నగరవాసి, వ్యాపారవేత్త వైశాక్ గత కొన్నినెలల క్రితం పారిశ్రామికవేత్త అరవిందరెడ్డిని బెదిరించిన కేసులో అరెస్టయి కొన్నాళ్లు జైల్లో ఉండి విడుదలయ్యాడు. ఆర్ఆర్ నగరలో నటి, స్నేహితురాలు కృషి తాపండ నివాసంలో కొన్నిరోజులుగా ఉంటున్నట్లు సమాచారం. అక్కడే ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలాడు.
ఫోన్ చేసి చెప్పగా..
వైశాఖ్కు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమారుడు ఉన్నాడు. కారు గ్యారేజ్, ఆటోమొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆర్ఆర్ నగరలోని ఎలిగెంట్ రేస్ అపార్టుమెంట్లోని 4వ ఫ్లోర్లో నటి కృషి తాపండ ఫ్లాట్లో బస చేశాడు. ఆమె బయటకు వెళ్లింది, రాత్రి 8:30 గంటలకు ఆమెకు కాల్ చేసి తాను చనిపోతున్నానని వైశాఖ్ చెప్పగా, ఆమె అతనికి నచ్చచెప్పింది. అర్ధరాత్రి తిరిగి వచ్చేటప్పటికి చనిపోయి ఉన్నాడు.
గతంలో బెదిరింపుల కేసు
గత ఫిబ్రవరిలో బెంగళూరు పారిశ్రామికవేత్త అరవిందరెడ్డి కి గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొరియల్లో లేఖ వచ్చింది. గతంలో కృషి తాపండతో అరవిందరెడ్డికి గొడవలు జరిగాయి. ఆమెతో ఉన్న గొడవలను పరిష్కరించుకోవాలి, అలాగే క్షమాపణ చెప్పి రూ.6 – 7 కోట్లు డబ్బు పంపాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో బెదిరించారు. దీనిపై అరవిందరెడ్డి హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వైశాఖ్ను అరెస్ట్చేసి జైలుకు పంపారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ఇతడు, నటి కృషి సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. గురువారమే కుక్కె పుణ్యక్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని కృషి తెలిపింది. ఫ్లాటులో ఎలాంటి డెత్నోట్ లభించలేదు. ఆర్ఆర్ నగర పోలీసులు విచారణ చేపట్టారు.
చివరి చూపునకు నో
వైశాఖ్ కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. చామరాజపేటే శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపారు. కృషి తాపండ వచ్చేటప్పటికి పూర్తయ్యాయి. ఆమెను చూసి వైశాక్ కుటుంబసభ్యులు గొడవకు దిగారు. నువ్వు రావద్దని, వెళ్లిపోవచ్చని చెప్పడంతో కృషి బోరున విలపించింది.
బెంగళూరులో ఘటన
కృషి తాపండ ఫ్లాటులో వైశాఖ్ మృతి
గతంలో బెదిరింపుల కేసులో
అరెస్టయిన వైశాఖ్


