హొసపేటె: విజయనగర జిల్లాలో వర్షాభావం నెలకొనడంతో మెట్ట పొలాల్లో రైతులు పండించిన ఆరు తడి పంటలకు సరిగా నీరు అందక ఎండిపోతున్నాయి. వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, కందులు, రాగులు, ఉలవలు, సజ్జలు, గోధుమ తదితర పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో కరువు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హొసపేటె తాలూకాలో వరి ప్రధాన పంట. ఉప పంటల్లో జొన్నలు, సజ్జలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుశెనగ పంటలకు సరైన వర్షపాతం లేక పోవడం పంటలనూ ప్రభావితం చేసింది. వ్యవసాయంపై వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాడి పరిశ్రమకు పశుగ్రాసం కొరతతో ఆందోళన చెందుతున్నారు.
సాధారణం కంటే లోటు వర్షపాతం
ఈ ఏడాది రుతుపవనాల ప్రారంభం నుంచి 230.76 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 34 శాతం లోటు వర్షపాతంగా ఉంది. గత సంవత్సరం కూడా వర్షాల కొరత ఏర్పడింది. 17,742 హెక్టార్లలో 98 శాతం మేర వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న పంటలు వేశారు. ఈ సంవత్సరం మొత్తం సాగు విస్తీర్ణంలో కేవలం 17 శాతం అంటే 7,155 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. మొత్తం మీద గత ఏడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం 80 శాతం మేర తగ్గింది. తాలూకాలో వర్షాలు కురవకపోవడం ఇలాగే కొనసాగితే, అన్ని పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. 40 శాతం మేర పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకు వర్షం చాలా అవసరమని వ్యవసాయ సహాయ సంచాలకులు అన్నారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే భారీగా పంట నష్టం వాటిల్లవచ్చని అంచనా వేస్తున్నారు.
తీవ్ర ఆందోళనలో రైతులు


