టిప్పర్లు, లారీల్లో ఎక్కుతున్న ప్రయాణికులు
స్టేషన్ బయట ప్రయాణికుల రద్దీ
శివాజీనగర: నమ్మ మెట్రో పర్పుల్ లేన్లో కబ్బన్ పార్కు మెట్రో స్టేషన్లో యాంత్రిక లోపంతో నిలిచిపోయిన రైళ్లు అటు అధికారులకు, ఇటు ప్రయాణికులకు నానా ఇబ్బందులు కలిగించాయి. చివరకు బుధవారం ఉదయం 5 గంటల నుంచి రైలు సర్వీసులను పునరుద్ధరించారు. వివరాలు.. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కబ్బన్ పార్కు స్టేషన్లో విద్యుత్ వ్యవస్థలో లోపం ఏర్పడింది. దీంతో నాడప్రభు కెంపేగౌడ స్టేషన్ మెజిస్టిక్ నుంచి ఎం.జీ.రోడ్డు మధ్య ప్రధాన స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పీక్ అవర్లో రైళ్లు కదలక వేలాది మంది ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. ఉసూరంటూ సిటీ బస్సులు, ఆటోల్లో గమ్యస్థానాలకు వెళాల్సి వచ్చింది. బస్సులు, ఆటోలు దొరకని వారు లారీల్లో, ట్రక్కుల్లో గుంపులుగా ఎక్కి వెళ్లే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెక్కీలు, మహిళలు కష్టపడి లారీలు, టిప్పర్లలో ఇళ్లకు బయల్దేరారు.
ముమ్మరంగా మరమ్మతులు
ఓ రైలు అక్కడే నిలిచిపోగా లోపల చిక్కుకొన్న ప్రయాణికులను అర్ధగంట తరువాత క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకూ మరమ్మతులు చేపట్టినా పరిష్కారం కాలేదు. బీఎంఆర్సీఎల్ ఇంజనీర్లు, సిబ్బంది తెల్లవారుజాము వరకు పనిచేసి కొలిక్కితెచ్చారు. ఈ ఇబ్బంది సమయంలో ఓర్పు, సహకారంతో ఉన్నందుకు ప్రయాణికులకు ధన్యావాదాలని బీఎంఆర్సీఎల్ తెలిపింది. మెట్రోలో లోపాలు, ప్రయాణికుల అవస్థలపై ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి.
పరిష్కారమైన యాంత్రిక సమస్య
ప్రయాణికులకు తప్పిన అవస్థలు


