కోలారు: బల్లి పడిన బిర్యానీ తిని ఆస్పత్రి పాలైన ఘటన బుధవారం బంగారుపేట పట్టణంలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని ఓ హోటల్కు వెళ్లిన స్థానిక నివాసి లలిత బిర్యానీ అడిగింది. బిర్యానీ, పెరుగు పచ్చడిని అందించారు. ఆమె ఆరగిస్తుండగా, కొంతసేవటికి బిర్యానీలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కయిన లలిత హోటల్ సిబ్బందిని పిలిచి ప్రశ్నించింది. బల్లి బిర్యానీలో కాదు, పెరుగు పచ్చడిలో పడిందని, వేరే బిర్యానీ తెచ్చిస్తామని సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే లలిత కుటుంబీకులు గొడవకు దిగారు. ఇంతలోనే లలిత కళ్లుతిరిగి అస్వస్థకు గురైంది. ఆమెను ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు వాంతులు, విరేచనాలు కాగా, చికిత్స అందించడంతో కోలుకుంటోంది. అక్కడే తిన్న మరో ఇద్దరు కస్టమర్లు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, నగరసభ అధికారులు హోటల్లో తనిఖీలు చేసి నమూనాలను సేకరించారు. హోటల్ను మూసివేయాలని ఆదేశించారు.
బంగారుపేటలో కలకలం


