దొడ్డబళ్లాపురం: గదగ్ నగరంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నెలరోజుల్లో రెండుసార్లు ఆక్సిజన్ పైపులు చోరీకి గురయ్యాయి. పర్యవసానంగా ఆపరేషన్ థియేటర్ను వైద్యులు మూసివేశారు. నగరంలోని కేసీ రాణి రోడ్డులో ఉన్న ప్రభుత్వ మహిళా–శిశు ఆస్పత్రిలో గత వారం దొంగలు ఆక్సిజన్ పైపులను ఎత్తుకెళ్లారు. మళ్లీ సెంట్రలైజ్డ్ ఏసీకి సంబంధించిన 8 ఔట్డోర్ యూనిట్లను పగలగొట్టి రాగి వస్తువులను దొంగిలించారు. దీంతో ఆస్పత్రిలో ఏసీలు మొత్తం ఆగిపోయాయి. ఏసీ, ఆక్సిజన్ వసతి లేక ఆపరేషన్ థియేటర్ను బంద్ చేశారు. వార్డుల్లో ఎండవేమిడి, ఏసీలు పనిచేయక బాలింతలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేని వారు ఇళ్ల నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద ఆస్పత్రికి సెక్యూరిటీ సిబ్బంది ఒకరో ఇద్దరో ఉన్నారు. వారు కూడా సరిగా విధులకు రావడం లేదు. వైద్య సిబ్బంది పట్టించుకునేలా లేరు. దీంతో దొంగలు, పోకిరీలు దొరికిన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఆస్పత్రి దుస్థితిపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వస్తుసామగ్రి దోచేస్తున్న దొంగలు


