రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా రైతులు పొలంలో వేసుకున్న పైర్లు వాడుముఖం పడుతున్నాయి. యాదగిరి, దేవదుర్గల్లో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే గుర్జి జోకుమార అంటూ జానపద శైలిలో పాటలు పాడుతూ ఇంటింటా తిరుగుతూ వానల కోసం యాతన పడుతున్నారు. మరోవైపు జోకుమారుడికి పూజలు జరిపి గ్రామాల్లో తిప్పుతూ వానలు కురువాలంటూ కేకలు పెడుతూ పాటలతో దేవుడికి మొర పేట్టుకున్నారు. దేవదుర్గ తాలూకా జాలహళ్లిలో మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల దేవుడిని మోసుకుని మంగళవారం రాత్రి సవారీ చేశారు.
వర్షం కోసం కప్పలకు పెళ్లి
హుబ్లీ: సమృద్ధిగా వానలు పడాలని స్థానిక బెంగేరి నివాసులు ద్యామవ్వ దేవి దేవస్థానం వద్ద కప్పలకు పెళ్లి చేసి సంప్రదాయం ప్రకారం విధి విధానాలను పాటించారు. కప్పలను చక్కగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఆ తర్వాత మహిళలు ఓ ఆట ఆడి దేవుడిని ప్రార్థించి ఆలయం చుట్టు ప్రదక్షణలు చేశారు. ఇప్పటికీ గ్రామాల్లో ఇలాంటి ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమాజ సేవకుడు రమేష్, కార్పొరేటర్లు నరగుంద, పీరప్ప కండేకర, ప్రముఖులు ఉవ్వప్ప, రాజు కాళె, బసమ్మ తదితరులు పాల్గొన్నారు.


