● రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్య ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ను దాటింది. రాయచూరు, కొప్పళ, బెళగావి, బీదర్, విజయపుర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో జనం ఉసూరుముంటున్నారు.
తాగునీటికి కటకట
మరోవైపు తాగునీటి కొరత జనాన్ని బెంబేలెత్తిస్తోంది. కేఆర్ఎస్ డ్యాం, శ్రీరంగపట్టణంలోని కట్టె జలాశయంలలో నీటిమట్టం దాదాపు అండుగంటింది. జూన్లో వర్షాలు పడకపోతే ఏమవుతుందోనని స్థానిక ప్రజలకు దిగులుగా ఉంది. బెంగళూరులోనూ ఇప్పటికే తాగునీటి కొరత ఏర్పడింది. కావేరి నీరు అందకుంటే ఏమవుతుందోనని ప్రజల్లో ఆందోళన ఉంది.
ధార్వాడలో వర్షం
ఆదివారం సాయంత్రం ఆశ్చర్యకరంగా ధార్వాడలో మేఘాలు కమ్మి జోరువాన కురిసింది. రోడ్లపై వాననీరు ప్రవహించింది. బాగల్కోటెలో ఉరుములు మెరుపులతో జల్లులు పడ్డాయి.


