
‘తుంగభద్ర’కు పెరిగిన వరద
హొసపేటె: కర్ణాటక, ఆంధ్ర,ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు రోజురోజుకు వరద పెరుగుతోంది. శనివారం సాయంత్రం డ్యాంలోకి ఇన్ఫ్లో రూపంలో 36 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో డ్యాంలో నీటినిల్వ 42 టీఎంసీలకు చేరుకోగా, నీటిమట్టం 1612.08 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజుల నుంచి నీటి నిల్వ భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్గేట్ స్థానంలో తాత్కాలికంగా స్టాప్లాగ్ గేట్ అమర్చిన దృష్ట్యా ఈఏడాది 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకోవాలని బోర్డు తీర్మానించింది. దీంతో 105 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నా 80 టీఎంసీలకే గరిష్ట నీటి నిల్వను కుదిస్తూ జలాశయం భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జలాశయం ఎగువన ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురవడంతో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న శివమొగ్గ, ఆగుంబె, శృంగేరి తదితర ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఊపందుకున్నాయి. డ్యాంలో నీటి నిల్వ 50లకు చేరుకోగానే ఆయా కాలువలకు నీటి విడుదలపై దృష్టి పెట్టి ఆయా రాష్ట్రాల వాటా నీటిని తీసుకోవాలని రైతు సంఘాలు ఒత్తిడి చేయడం మొదలైంది. దీంతో నీటి విడుదలపై ఐసీసీ సమావేశం ఏర్పాటుపై ఈనెల 27న కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి ఆధ్వర్యంలో బెంగళూరు విధానసౌధలో సమావేశం జరుగనున్నట్లు తెలిసింది. అదే రోజున బోర్డుకు ఆయా రాష్ట్రాల నీటి వాటాలపై స్పష్టత రానుంది.