
ఎవరి కోసం ట్రాఫిక్ రూల్స్?
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కన్నెర్ర చేస్తున్నప్పటికీ అతిక్రమణలు తగ్గడం లేదు. ఈ ఏడాది ఐదు నెలల్లో 23.68 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు రికార్డయ్యాయి. అంతేకాకుండా మొత్తం రూ. 52.62 కోట్ల మేర జరిమానాలను పోలీసులు వసూలు చేయడం గమనార్హం.
రోజురోజుకూ అధికం
సిలికాన్ సిటీలో వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు తోడుగా ట్రాఫిక్ రద్దీ కూడా ఎగబాకుతోంది. అదేస్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు అధికమయ్యాయి. దీంతో సహజంగానే ట్రాఫిక్ జరిమానాలు కూడా పెరిగాయి. నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించడం కష్టమని భావించేవారు యథేచ్ఛగా నడుపుతుంటారు. మరోవైపు పోలీసులు ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు కొత్త కొత్త విధానాలను ఆశ్రయిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలను ఎక్కువగా మోహరించారు. వాహన నంబరును గుర్తించి యజమానుల మొబైల్కు సందేశం పంపించి జరిమానాలను పోలీసు శాఖ వసూలు చేస్తోంది. జరిమానాలు చెల్లించని వారి ఇళ్లకే వెళ్లి వాహనం సీజ్ చేసి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో చలానాల మొత్తం ఏటేటా కాసులు కురిపిస్తోంది.
అనేక రకాల అతిక్రమణలు
2024, జనవరి నుంచి మే వరకు ఐదునెలల్లో మొత్తం 39.10 లక్షల కేసులు నమోదు కాగా, ఈసారి 2025లో జనవరి నుంచి మే వరకు ఆ జోరు కాస్త తగ్గడం గమనార్హం. అయితే కేసుల సంఖ్య తగ్గినా జరిమానాలు మాత్రం పెరగడం విశేషం. హెల్మెట్, సీట్బెల్ట్ లేకపోవడం, సిగ్నల్ జంప్, నో పార్కింగ్లో నిలపడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ఫుట్పాత్ ప్రయాణం, డీఎల్, ఆర్సీలు లేకపోవడం, ట్యాక్సీ డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం, మద్యం తాగి డ్రైవింగ్, ఇన్సురెన్స్, పొల్యూషన్ ధృవపత్రాలు లేకపోవడం తదితరాల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయి.
జాగృతి కార్యక్రమాలు
ట్రాఫిక్ నిబంధనలతో పాటే యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. పాఠశాల స్థాయిలో నుంచే ట్రాఫిక్ విద్యపై, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావించింది. అందుకే ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ నిబంధనల గురించి జాగృతి కల్పిస్తున్నారు. కార్యాలయాలు, గృహ లేఔట్లలో జాగృతి ర్యాలీలను నిర్వహిస్తున్నారు. సరైన రోడ్లు, సిగ్నల్ వ్యవస్థలు లేవు, పార్కింగ్ ప్రదేశాలు కరువు, ఇలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల సిగ్నల్ జంపింగ్లు జరుగుతున్నాయని కొందరు వాహనదారులు ఆరోపించారు.
బెంగళూరువాసుల ఉదాసీనత
5 నెలల్లో 23.68 లక్షల కేసులు
రూ. 52 కోట్ల జరిమానాలు
సిలికాన్ సిటీలో ఇష్టారాజ్యమా?
ఈ ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన సంఘటన ఇది. ఓ స్కూటరిస్టు చలానాల పొడవు ఏకంగా 20 మీటర్ల వరకూ ఉంటుంది. ఉల్లంఘనలు 311 కాగా, పడిన చలానా మొత్తం రూ.1.6 లక్షలు. పోలీసులు తనిఖీలలో గుర్తించి అతని స్కూటర్ని సీజ్ చేశారు. చివరకు చలానాలు చెల్లించి బయటపడ్డాడు. ఎంత చలానా అయినా కట్టేస్తాం, అందుకోసం ఎంత సమయమైనా వెచ్చిస్తాం కానీ, ట్రాఫిక్ రూల్స్ని మాత్రం పాటించేది లేదు అంటున్నారు కొందరు వాహనదారులు.

ఎవరి కోసం ట్రాఫిక్ రూల్స్?

ఎవరి కోసం ట్రాఫిక్ రూల్స్?

ఎవరి కోసం ట్రాఫిక్ రూల్స్?