
రైలు పట్టాలపై బండరాళ్లు
యశవంతపుర: హాసన్ జిల్లా సకలేశపుర– సుబ్రమణ్యరోడ్డు రైల్వేస్టేషన్ మధ్య ఎడకుమేరి–శిరిబాగిలు సమీపంలో భారీ కొండరాళ్లు రైల్వే పట్టాలపై పడ్డాయి. దీంతో పట్టాలు విరిగి, రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఘాట్ మార్గంలో శనివారం ఉదయం 9:10 గంటలకు బండరాళ్లు జారి పడ్డాయి. సమాచారం తెలిసి రైల్వే అధికారులు జేసీబీలతో తొలగింపు పనులను చేపట్టారు. కిలోమీటర్ 74, 75 వద్ద బండరాళ్లు పడి ఉండడంతో రైలు కో పైలట్ గమనించి బ్రేకులు వేసి నిలిపేశారు. లేని పక్షంలో ఇంజన్ బండరాళ్లను ఢీకొని పెద్ద ప్రమాదం జరిగేది. చిక్కుబడిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని గంటల తరువాత బండరాళ్లను తొలగించి రైలును పంపించారు. ఈ ప్రాంతంలో గంటకు 20 కిలోమీటర్ల వేగంతోనే రైళ్లు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అలాగే పలు రైళ్ల సంచారంలో భారీ మార్పులు చేసిన్నట్లు హుబ్లీ రైల్వే అధికారులు తెలిపారు.
హాసన్ జిల్లాలో ఘటన