
కనువిందుగా కరగ
చింతామణి: పట్టణం 13 వార్డు ప్రాంతంలోని ప్రజలు గంగమ్మ ఆలయ జాతర సందర్భంగా కరగ మహోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కరగ పూజారి హోళూరు వసంతకుమార్ నృత్యాలతో అలరించారు. వినోభా కాలనీ ముందు సంగీత కచేరీ పట్టణవాసులకు ఆకట్టుకుంది. గాయనీ గాయకులు చలనచిత్ర పాటల ఇంపుగా ఆలపించారు. జానపద కళా బృందాల ప్రదర్శనలు రంజింపజేశాయి.
కేంద్రమంత్రి కాళ్లు మొక్కిన హాసన్ కలెక్టర్
యశవంతపుర: హాసన్ జిల్లా అరసికెరె తాలూకాలోని కోడిమఠానికీ కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమణ్ణ వెళ్లారు, ఈ సమయంలో జిల్లా కలెక్టర్ లతాకుమారి మంత్రి కాళ్లకు నమస్కరించారు. కలెక్టర్ కేఎస్ లతాకుమారి మూడు రోజుల కిందట నియామకమయ్యారు. మంత్రి రాగానే ఆమె పుష్పగుచ్ఛం అందజేసి కాళ్లకు మొక్కారు. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందని, మీకు కావలసినవారమని కలెక్టర్ చెప్పడం గమనార్హం. మంత్రి సోమణ్ణ స్పందిస్తూ మీరు ఎవరి మధ్య చిక్కుకోవద్దు, బాగా పని చేయాలని సూచించారు. బేలూరు–హాసన్ మార్గంలో 503 ఎకరాలు భూ స్వాధీనం చేసుకోవాలి. ఇదీ మీ అవధిలోనే జరగాలని అన్నారు. మీ ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని లత అన్నారు. కాళ్లు మొక్కే వీడియో బాగా వైరల్ అయ్యింది. జిల్లాధికారి ఇలా చేయవచ్చా..? అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
పాలికెలో లోకాయుక్త తనిఖీలు
యశవంతపుర: లంచం డిమాండ్ చేసిన ఆరోపణలతో లోకాయుక్త అధికారులు మంగళూరు మహానగర పాలికైపె దాడి చేశారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగంతో పాటు అన్ని సెక్షన్లలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను పరిశీలించారు. ఇటీవల ఇళ్లను ఖాతా చేయడానికి లంచాలు డిమాండ్ చేసినట్లు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఎస్పీ కుమారచంద్ర నేతృత్వంలో దాడి చేసి అనేక ఫైళ్లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.
క్లబ్పై పోలీసుల దాడి
ఉత్తర కన్నడ జిల్లా కారవార జిల్లా భట్కళ వద్ద కల్బండి భూమికా ప్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్పై పోలీసులు దాడి చేశారు. క్లబ్లో ఇస్పేట్ జూదం ఆడుతుండగా యజమాని మహదేవయ్యతో పాటు 25 మందిని అరెస్ట్ చేశారు. కొంత నగదుతో పాటు కార్డులు, టోకెన్, కార్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు.
స్కూలు బస్సుల తనిఖీలు
శివమొగ్గ: ఇటీవల మైసూరు వద్ద స్కూలు బస్సు బోల్తా పడి 20 మంది బాలలు గాయపడ్డారు, ఈ నేపథ్యంలో శివమొగ్గ నగరంలో ట్రాఫిక్ పోలీసులు పాఠశాల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. భద్రతా నియమాలను పాటించడం గురించి డ్రైవర్లకు కఠినంగా హెచ్చరించారు. పాఠశాల పిల్లల భద్రత దృష్ట్యా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లు, రోడ్లలో స్కూలు బస్సులను ఆపి కండీషన్లో ఉండా లేదా చూశారు. అలాగే ట్రాఫిక్ నియమాల ప్రకారం నడపాలని డైవర్లకు సూచించారు. పరిమితికి మించి పిల్లలను వాహనాల్లో తీసుకెళ్లకూడదని, అన్ని పత్రాలు ఉండాలని, డ్రైవర్లు ధూమపానం, మద్యపానం చేయరాదని, నిర్లక్ష్యంగా నడపరాదని తెలిపారు.

కనువిందుగా కరగ