
నలుదిశలా యోగోత్సవం
మైసూరు: ప్రపంచ యోగా దినోత్సవాన్ని కన్నడనాట ఉత్సాహంగా ఆచరించారు. బెంగళూరులో విధానసౌధ వద్ద శనివారం ఉదయమే వందలాది మంది సామూహిక యోగాసనాలను ఆచరించారు. ఒక భూమి, ఒక ఆరోగ్యం అనే నినాదంతో సాగింది. ఇక మైసూరులో విశ్వవిఖ్యాత అంబావిలాస్ ప్యాలెస్ ఆవరణలో వేలాది మంది యోగా కార్యకర్తలు యోగాసనాలలో లీనమయ్యారు. చలిగాలులు వీస్తుండగా యోగాభ్యాసకులు తరలివచ్చారు. ఓంకార నాదంతో శ్రీకారం చుట్టారు. యోగా గురు పీఎస్ గణేష్ కుమార్ శంఖనాదాన్ని మోగించారు. 4 నిమిషాల పాటు చలనక్రియ, 25 నిమిషాల పాటు యోగాసనాలు, 14 నిమిషాల పాటు ప్రాణాయామం, ధ్యాన సంకల్పం చేశారు. సుమారు 15 వేల మందికి పైగా విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు పాల్గొన్నట్లు అంచనా. మంత్రి డాక్టర్ హెచ్సీ మహదేవప్ప, ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్, ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిత్యం యోగా ఆచరించడం ద్వారా ఉత్తమ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. దివ్యాంగ బాలలు, విదేశీయులు కూడా పాల్గొనడం విశేషం. జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి, జెడ్పీ సీఈఓ యుకేష్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
చెన్నకేశవ ఆలయం వద్ద
మైసూరు జిల్లాలోని టీ.నరసీపుర తాలూకా సోమనాథపురలోని చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో యోగా దినోత్సవం జరిగింది. కేంద్ర ఉన్నత విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్మ్స్ట్రాంగ్ పామె పాల్గొన్నారు.
విధానసౌధ, మైసూరు ప్యాలెస్ ముందు యోగాచరణ

నలుదిశలా యోగోత్సవం

నలుదిశలా యోగోత్సవం