
కుక్కను తప్పించబోయి టీచర్ మృత్యువాత
రాయచూరు రూరల్: పాఠశాలలో ఉత్తమ రీతిలో పాఠాలు బోధించే మాస్టారు కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన శుక్రవారం సాయంత్రం విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకాలో చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు వాసుదేవ్ హంచాటే(46) కణకాళలో విజ్ఞాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ అంబలనూరు క్రాస్ వద్ద ద్విచక్రవాహనంలో వేగంగా వెళుతుండగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్ స్కిడ్ కావడంతో ఉపాధ్యాయుడు అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించారు. ఉత్తమ ఉపాధ్యాయుడిని కోల్పోయామంటూ తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు రోదించారు. కాగా ఈ ఉపాధ్యాయుడు రోజు హెల్మెట్ ధరించేవారు. నేడు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో మృత్యువు బారిన పడినట్లు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

కుక్కను తప్పించబోయి టీచర్ మృత్యువాత