
పాఠ్యాంశాల్లో నైతిక విద్య బోధించాలి
హుబ్లీ: ఉత్తమ వ్యక్తి నిర్వహణతో పాటు ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే దిశలో ప్రస్తుతం పాఠశాల పాఠ్యాంశాల్లో నైతిక విద్య, విలువలతో కూడిన బోధన చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆయన ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్పకు లేఖ రాశారు. ప్రస్తుతం అన్యాయాలు, అసహనం, దురాచారాలు తదితర అంశాలు కనిపిస్తున్నాయి. దీనికి విద్యా బోధనలో విలువలపై శిక్షణ కొరతే ముఖ్య కారణం అన్నారు. పిల్లలు మంచి ఆచారాలు, ఉత్తమ సంస్కారాన్ని పొందాలంటే విలువలతో కూడిన విద్యా బోధన అవసరం అన్నారు. తాము చదువుకువే రోజుల్లో పాఠశాలతో పాటు నీతి కథలు బోధించే వారు. దీంతో పిల్లలు ప్రామాణికత, సమగ్రత, సానుభూతి, దయ, న్యాయసమ్మతం, సహనం, క్రమశిక్షణ, కఠోర కృషి, ఉదారత్వంతో బాధ్యతలను నెరవేర్చడం అలవాటు చేసుకొని సాత్విక, ఆదర్శ జీవితాన్ని గడిపామన్నారు. అలాంటి గుణాలు నేడు కనిపించడం లేదన్నారు. విలువలతో కూడిన విద్యా బోధన కొరత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ప్రధాన కారణం అని తెలిపారు. చిన్నారుల సర్వతోముఖాభివృద్ధే దేశ భవితకు పునాది అన్నారు. నేటి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాలల హక్కుల రక్షణ, పిల్లలు వ్యసనాలు లేని జీవితాన్ని గడిపేందుకు పలు నిర్ణయాలను తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.