
వాణిజ్య నగరి.. తగ్గని నేరాల అల్లరి
హుబ్లీ: చోటా ముంబైగా ప్రసిద్ధి చెందిన హుబ్లీ నగరంతో పాటు ధార్వాడ జిల్లా నేరాల్లో కుఖ్యాతిని గడించింది. దీనికి నిదర్శనంగా ఈ ఏడాది నాలుగు నెలల్లో 15 హత్యలు, 83 హత్యాయత్న కేసులు నమోదు కావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. జంట నగరాల్లో హత్యాయత్నాలు, దాడులు, దోపిడీల కేసులు రోజూ ఏదో ఒక చోట జరుగుతుండటంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 2024తో పోల్చితే క్రైం రేట్ కొద్ది మేర తగ్గడం ఊరటనిచ్చే విషయమే. అయితే ఏదో ఒక కారణంతో పోకిరీలు, గల్లీ రౌడీల ఆగడాలు, ఘర్షణలు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లు, అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయం పరిధిలో 14 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఉత్తర కర్ణాటక కేంద్ర బిందువైన హుబ్లీలో గంజాయి, సైబర్, వడ్డీల దందా, చోరీలు, రౌడీ కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
నేరాలకు కళ్లెం పడేనా?
అయితే ఈ ఏడాది నేరాల చిట్టా కాస్త గమనిస్తే కొంత ఉపశమనం చెందవచ్చు. చోరీలు, దాడులు, హత్యాయత్నాలు జరుగుతుండటంపై నేర కార్యకలాపాలకు కళ్లెం వేయాలని పోలీస్ శాఖ వైపు ప్రజలు చూస్తున్నారు. 2025 ఏప్రిల్ నెలాఖరు వరకు హుబ్లీలో 3 హత్యలు, 72 హత్యాయత్నాలు, అలాగే ధార్వాడ జిల్లాలో 12 హత్యలు, 11 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయి. 2024లో మొత్తానికి హుబ్లీలో 22 హత్యలు, 85 హత్యాయత్నం కేసులు, అలాగే జిల్లాలో 19 హత్యలు, 25 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల మేరకు హత్యలను నివారించే దిశలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేయాల్సి ఉంది. అయితే నాలుగు నెలల్లోనే 83 హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇక ఏడాది ప్రారంభంలో చోరీలు, కుటుంబ కలహాలు, కక్షలు కార్పణ్యాలు, ఆర్థిక సంబంధిత గొడవలకు సంబంధించిన కేసులు కూడా జిల్లాలో జరిగాయి.
నేరాల చిట్టా పరిశీలిస్తే..
హుబ్లీలో 2025 ఏప్రిల్ చివరికి 6 హత్యాచారాలు, 4 దోపిడీలు, నాలుగు చోరీలు, 44 చిన్నాచితక దొంగతనాలు, 160 జూదాలు, 9 పోక్సో కేసులు దాఖలు అయ్యాయి. ఇక జిల్లా పరిస్థితికి వస్తే ఒక దోపిడీ, రాబరీ, 33 చోరీలు, 59 జూదాలు, అలాగే 8 పోక్సో కేసులు దాఖలు అయ్యాయి. 2024లో కమిషనరేట్ పరిధిలో 22 హత్యలు, 85 హత్యాయత్నాలు, 20 హత్యాచారాలు, 28 రాబరీ, 221 చోరీలు, 86 జూదాలు, 247 సైబర్, అలాగే 65 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. జిల్లా ఎస్పీ పరిధిలో 19 హత్యలు, 25 హత్యాయత్నాలు, 9 రాబరీ, 104 చోరీలు, 214 జూదాలు, 46 పోక్సో కేసులు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా గల్లీ రౌడీలు పోకిరీల ఆగడాలపై పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ సంఘ విద్రోహ శక్తుల ఆటలు కట్టించడం మాత్రం సాధ్యం కావడం లేదు.
నాలుగు నెలల్లో 15 హత్యలు, 83 హత్యాయత్నం కేసులు
భయాందోళనలో హుబ్లీ ధార్వాడ జంట నగరాల ప్రజలు

వాణిజ్య నగరి.. తగ్గని నేరాల అల్లరి