రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయాలని చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉందని, అయితే ఎవరి ప్రభావంతోనూ ఎయిమ్స్ మంజూరు కాదని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సోమవారం రాయచూరులో తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో ఒక కమిటీని రూపొందిస్తుందన్నారు. కమిటీ అధ్యయనం చేసి మౌలిక సౌకర్యాలపై కూడా అవగాహన చేసిన తరువాత మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్లో రాష్ట్రం నుంచి మూడు జిల్లాల పేర్లను కేంద్రానికి పంపి రాయచూరుకు ఎయిమ్స్ రాకుండా అడ్డుకున్న విషయాన్ని జోషి ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ 11 ఏళ్ల పాలనలో ఆర్థికంగా అభివృద్ధిని సాధించి ప్రపంచంలోనే నాలుగో దేశంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీల పేరుతో 48 వస్తువులపై పన్నులు పెంచారని ఆరోపించారు.