నాణ్యమైన విద్యా బోధనకు పెద్ద పీట
బళ్లారిఅర్బన్: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నాణ్యతతో కూడిన బోధన ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆశక్తి పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి ఎస్.మధు బంగారప్ప తెలిపారు. సోమవారం బీపీఎస్ఈ మీటింగ్ హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి గురుతరమైన బాధ్యత అప్పగించామన్నారు. పాఠశాల వేళలు మినహాయించి సాయంత్రం కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో అభ్యాసం చేయడానికి మార్గదర్శనం చేస్తున్నామన్నారు. పరీక్షల పవిత్రత కాపాడటానికి పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కేంద్రాలు, వెబ్ కాస్టింగ్ చేపట్టామన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మూడు సార్లు పరీక్షలు రాసే అవకాశం కల్పించామన్నారు. అప్పటికీ ఉత్తీర్ణులు కాకపోతే అలాంటి విద్యార్థులకు పాఠశాలల్లో పునర్ ప్రవేశానికి అవకాశం కల్పించామన్నారు. ఇలాంటి వారికి కూడా అందరితో పాటు దుస్తులు, పుస్తకాలు, షూ తదితర సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండో విడత పరీక్షలు పూర్తయ్యాయన్నారు. వీటిలో ఫెయిల్ అయిన వారికి మార్కులు శాతం పెంచుకోవడానికి గాను మొత్తం 84 వేల మంది అనగా 98.25 ఉత్తీర్ణులయ్యారని మంత్రి వివరించారు. అలాగే అన్ని పాఠశాలల్లో ముఖాన్ని గుర్తిస్తు హాజరు కావడం తప్పనిసరి చేశామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశామన్నారు. అజీమ్ ప్రేమ్జీ ఇన్ఫోసిస్ తదితర సంస్థల కేఎస్ఆర్ నిధులను వినియోగించుకొని విద్యార్థుల ఆరోగ్యం, పౌష్ఠికాహారం నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు కూడా సదరు పాఠశాలకు ఏమైనా సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. 13 వేల మంది ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దీనికి సీఎం అనుమతిని ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి, బీపీఎస్సీ విద్యా సంస్థల అధ్యక్షుడు మహిపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మంత్రి తనిఖీ
బళ్లారిఅర్బన్: విద్యార్థులు రోజు పాఠశాలకు రావాలి, ఏ కారణంతోను స్కూల్కు గైర్హాజరు కారాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప సూచించారు. స్థానిక పటేల్ నగర్ లేఅవుట్ ప్రభుత్వ ఆదర్శ సీనియర్ ప్రాథమిక పాఠశాలను ఆయన అకస్మికంగా సందర్శించి 7వ తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంట్లో స్కూల్కు వెళ్లడానికి అభ్యంతరం పెడితే తాను తప్పకుండా స్కూల్కు వెళతానని చెప్పాలని విద్యార్థులకు హితవు చెప్పారు. పాఠశాలలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా చదువుకొని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠిక సారాంశాన్ని 5వ తరగతి విద్యార్థిని రితిక సమగ్రంగా వివరించారు. అంతేగాక మంత్రి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం సేవించారు. అన్నం, సాంబారు, ఊరగాయ, ఉడికిన గుడ్డును అందరికీ వడ్డించి ఆయన తిన్నారు. అలాగే వివిధ గదులను పరిశీలించారు. భోజనం ఎలా ఉంది? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా, డాక్టర్ ఆకాశ్ శంకర్, డీడీపీఐ ఉమాదేవి, వేదావతి, ఆ పాఠశాల హెచ్ఎం జయశ్రీ, బీఈఓ తదితరులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మంత్రి మధు బంగారప్ప
నాణ్యమైన విద్యా బోధనకు పెద్ద పీట
నాణ్యమైన విద్యా బోధనకు పెద్ద పీట


