
కేబినెట్ విస్తరణ బాధ్యత అధిష్టానానిదే
రాయచూరు రూరల్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. సోమవారం రాయచూరులో విలేఖర్లతో ఆయన మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైకమాండ్తో చర్చించారో లేదో తనకు తెలియదన్నారు. ఉన్న శాసన సభ్యుల స్థానాలను భద్రపర చుకోవాలే తప్ప అధికారం శాశ్వతం కాదని అన్నారు. ప్రభుత్వంలో హెచ్చుతగ్గులు సహజమన్నారు. బీజేపీ హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆ పదవిలో గట్టిగా ఉన్నారన్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. విధాన పరిషత్ స్థానాలకు నామినేట్ చేసిన పేర్లలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. విధాన పరిషత్ సభ్యులకు మంత్రి పదవులు కేటాయించే అధికారం అధిష్టానానికి సంబంధించిన విషయం అన్నారు. కులగణన సమీక్షకు రూ.కోట్లాది వ్యయం అవుతుందన్న ప్రతిపక్ష నేతలకు కోవిడ్ సమయంలో రూ.3 వేల కోట్ల నష్టం జరిగిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. బీజేపీ నేతలకు మరో మూడేళ్ల పాటు తమపై బురద చల్లడం తప్ప వేరే పని లేదని ఎద్దేవా చేశారు.