
నేరగాళ్లపై పేలిన గన్
యశవంతపుర: వృద్ధురాలిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన పాత నేరగాన్ని ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పోలీసులు కాల్పులుజరిపి అరెస్ట్ చేశారు. ఈ నెల 12న స్థానిక అటవీ ప్రాంతంలో వృద్దురాలిపై అత్యాచారం, దోపిడి జరిగింది. శనివారం రాత్రి దాండేలి గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలోని కుళగి అటవీ ప్రాంతంలో నిందితుడు సైరోజ్ యాసీన్ యరగట్టి (23) ఉన్నట్లు తెలిసి వెళ్లారు. పట్టుకోవడానికి యత్నించగా రాళ్లు విసిరి, చాకుతో దాడి చేసి పారిపోవడానికి యత్నించాడు. దీంతో ఎస్ఐ కిరణ్ పాటిల్ నిందితుని కాలి మీద కాల్చడంతో పడిపోయాడు. నిందితుని దాడిలో ఎస్ఐ కిరణ్ పాటిల్, సిబ్బంది కృష్ణప్ప బెళ్లవరి, ఇమ్రాన్ కంబారకు గాయాలు కాగా దాండేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. నిందితునికి చికిత్స అందిస్తున్నారు.
బెంగళూరులో హత్య కేసులో..
బెంగళూరులోను హత్య కేసు నిందితులపై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. ఆర్ఆర్ నగర షణ్ముగ దేవస్థానం వద్ద హత్య కేసు నిందితులపై తూటలు పేల్చి పట్టుకున్నారు. దీపు (28), అరుణ్(27)లు దాక్కుని ఉండగా పోలీసులు అరెస్టు చేయబోయారు. దీంతో కత్తులతో దాడి చేయగా ఫైరింగ్ జరిగింది. నిందితులు శుక్రవారమే జైలు నుంచి బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. విజయ్ అనే వ్యక్తిని మాట్లాడాలని పిలిచి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. కాల్పుల్లో నిందితులు గాయపడ్డారు. వారి దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు తగిలాయి.
ఉత్తర కన్నడ, బెంగళూరులో ఘటనలు
నిందితులకు, పోలీసులకు గాయాలు