
బనశంకరీ మాతకు విశేష పూజలు
బనశంకరి: భక్తుల కల్పవల్లి బనశంకరీదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆదివారం వేకువజామున సుప్రభాతసేవ తరువాత అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్ కు ప్రత్యేక అభి షేకం, అర్చన చేపట్టి విశేషంగా పూల అలంకరణచేసి పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు విచ్చేసి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు.
నాకు ఆయుష్షు ఉంది
● కేంద్ర మంత్రి కుమారస్వామి
శివాజీనగర: నేను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో మునుముందు జేడీఎస్–బీజేపీ సంకీర్ణం అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఆదివారం పార్టీ ఆఫీసు జేపీ భవన్లో మిస్డ్ కాల్ సభ్యత్వ నమోదు అభియానను అట్టహాసంగా ప్రారంభించి మాట్లాడారు. నాకు మూడుసార్లు గుండె శస్త్ర చికిత్స, రెండుసార్లు గుండెపోటు వచ్చింది, భగవంతుడు ఆయుష్షు ఇచ్చాడు. ప్రజల కోసమే బ్రతికానని చెప్పారు. బీజేపీతో వెళదాం, తప్పు చేయడం మంచిది కాదు. మునుముందు ఏమి జరుగుతోందో భగవంతునికే తెలుసన్నారు. బీజేపీ–జేడీఎస్ సంకీర్ణంలో గందరగోళం లేదన్నారు. కళ్యాణ కర్ణాటకను అభివృద్ధి చేయండి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు, ఆయన ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నారు, అప్పుడేం చేశారు అని విమర్శించారు.
రైలు కింద తల పెట్టి..
మండ్య: వెళుతున్న రైలుకింద తల పెట్టి యువకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ పశ్చిమ వాహిని వద్దనున్న రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. మృతుడు శ్రీరంగ పట్టణం తాలూకాలోని అరెకెరె గ్రామానికి చెందిన ఆకాశ్ (23) అని తెలిసింది. ఆకాశ్ మైసూరులో అద్దె గదిలో ఉంటూ ఓ మాల్లో పనిచేసేవాడు. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. రైల్వే పట్టాలపై తల, మొండెం వేరు వేరైన స్థితిలో కనిపించాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానాలున్నాయి.