కృష్ణమ్మ పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ పరవళ్లు

Jun 15 2025 7:23 AM | Updated on Jun 15 2025 7:23 AM

కృష్ణ

కృష్ణమ్మ పరవళ్లు

ఆల్మట్టి డ్యాం నుంచి

52 వేల క్యూసెక్కుల విడుదల

రాయచూరు రూరల్‌: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం నుంచి ముందు జాగ్రత్తగా కృష్ణా నదిలోకి 52 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. నారాయణపూర్‌ డ్యాంకు ఆ నీరు చేరుతోంది. శనివారం యాదగిరి జిల్లా హుణసిగి తాలూకాలోని నారాయణపూర్‌ డ్యాంకు ఉధృతి పెరగడంతో 14 గేట్ల నుంచి 52 వేల క్యూసెక్కులను వదిలారు. విజయపుర, బాగలకోటె, యాదగిరి, రాయచూరు జిల్లాల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నది దిగువన గ్రామాలకు ముంపు అపాయం నెలకొంది.

టర్ఫ్‌ క్లబ్‌లో రూ.2.5 కోట్ల స్కాం

బనశంకరి: బెంగళూరు టర్ఫ్‌ క్లబ్‌లో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. క్లబ్‌కు కావలసిన ఎరువులు, గుర్రాల దాణా కొనుగోలులో సిబ్బంది రూ.2.5 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారు. క్లబ్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ వీటి కొనుగోలు టెండర్లు చూసుకునేవాడు. 2024లో ఆర్థిక వ్యవహారాల మీద ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో ఆడిటింగ్‌ చేయించగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.2.5 కోట్లను అతడు స్వాహా చేసినట్లు గుర్తించారు. హైగ్రౌండ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.

గిరిజా కళ్యాణోత్సవం

కోలారు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో స్వామివారికి గిరిజా కళ్యాణోత్సవం శనివారం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు సురేష్‌ చైతన్య నేతృత్వంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకారం, వేదమంత్ర పారాయణం తదితరాలను చేపట్టారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సోమేశ్వరస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, నవగ్రహాలకు విశేష పూల అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవ విగ్రహాలకు నేత్రపర్వంగా గిరిజా కళ్యాణోత్సవాన్ని సాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆగుంబె ఘాట్‌లో

ట్రాఫిక్‌ ఆంక్షలు

శివమొగ్గ: వర్షాకాలంలో కొండ ప్రాంతాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున జిల్లాలో ఆగుంబె ఘాట్‌లో హైవేలో వాహనాల రాకపోకలు పరిమితం చేశారు. వర్షాకాలంలో ఆగుంబె ఘాట్‌ రోడ్లు కూలడం, మట్టి చరియలు పడిపోవడం సాధారణం. దీంతో శివమొగ్గ, ఉడుపి అధికారులు ఈ నెల 15 నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు వాహనాల రాకపోకలు పరిమితం చేసినట్లు తెలిపారు. తేలికపాటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఉడుపి, తీర్థహళ్లి మధ్య ప్రయాణించే వాహనాలు ఉడుపి, కుందాపుర, సిద్దాపుర, మాస్తికట్టే, ,తీర్థహళ్ళి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో నడపాలని ప్రకటించారు.

కృష్ణమ్మ పరవళ్లు 1
1/1

కృష్ణమ్మ పరవళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement