
శిశువును అపహరించి.. తన బిడ్డేనని నాటకం
దొడ్డబళ్లాపురం: బాగలకోట జిల్లా ఆస్పత్రిలో నవజాత శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. రామదుర్గ తాలూకా ఖానపేట నివాసి సాక్షి యాదవాద (24) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆమె ఆస్పత్రి సిబ్బందికి తెలియకుండా కాన్పుల వార్డులోకి వెళ్లి బెడ్ మీద పడుకుంది. తనకు కాన్పు అయ్యిందని అందరితో అబద్ధం చెప్పింది. శనివారం తెల్లవారుజామున లేచి వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకుని తాను నర్స్నని చెప్పుకుని, చెకప్ చేయాలని తీసుకెళ్లి తన పక్కన పడుకోబెట్టుకుంది. బిడ్డను పోగొట్టుకున్న మహిళ లబోదిబోమంటూ సిబ్బందికి చెప్పింది. వారు అంతటా వెదికారు, చివరకు అనుమానం రావడంతో నిందితురాలిని ప్రశ్నించారు. అయితే ఆమె తనకు పుట్టిన బిడ్డ అంటూ వాదించింది. దీంతో వైద్య సిబ్బంది పోలీసుల సాయంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా ఆమెకు అసలు ప్రసవం కాలేదని తేల్చారు. వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 2024లో కూడా ఆమె ఓ శిశువును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసింది.
నవంబర్లో సీఎం మార్పు
● ఎమ్మెల్సీ విశ్వనాథ్
మైసూరు: వచ్చే నవంబర్ నెలలో సీఎం మార్పు తథ్యమని, సిద్దరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేదా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె వీరిద్దరిలో ఒకరు నూతన సీఎం కావడం ఖాయమని సీనియర్ బీజేపీ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ జోస్యం చెప్పారు. ఆయన శనివారం నగరంలో జలదర్శిని అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. నవంబర్లో కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను తప్పించడం ఖచ్చితమంటూ పై విధంగా విశ్లేషించారు. సిద్దరామయ్య గతంలో సీఎంగా ఉన్నప్పుడు పదేళ్ల క్రితమే కులాల వారీగా జనగణన చేయించారన్నారు. సుమారు లక్షన్నర మంది ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు లెక్కింపు నిర్వహించారన్నారు. అందుకోసం రూ.170 కోట్లకు పైగా నిధులు ఖర్చయ్యాయన్నారు. అప్పటి నుంచి గణన నివేదికను బహిర్గతం చేయకుండా అటక ఎక్కించారన్నారు. తాజాగా హైకమాండ్కు భయపడి మళ్లీ కులాల వారీ జనగణన చేయిస్తామని సీఎం చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. కులగణన చేయడానికి ఉపాధ్యాయులు కావాలి. అయితే ఇప్పుడిప్పుడే పాఠశాలలు ప్రారంభమైనందున ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరని అన్నారు.

శిశువును అపహరించి.. తన బిడ్డేనని నాటకం