
25 నుంచి కాలువలకు నీరు వదలండి
బళ్లారిటౌన్: తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 25 టీఎంసీల నీరు నిల్వ చేరినందున ఈ నెల 25వ తేదీ నుంచి కాలువలకు నీరు వదలాలని తుంగభద్ర రైతు సంఘం నాయకుడు కరూరు మాధవరెడ్డి సూచించారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మిరప పంట పండినా, ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారన్నారు. ఈసారి 80 టీఎంసీలు మాత్రమే డ్యాంలో నీటిని నిల్వ ఉంచుతామని, ఒక పంటకు మాత్రమే నీరు వదులుతామని బోర్డు అధికారులు వెల్లడించినందున ప్రస్తుతం ఉన్న నీటిని తొలుత మిరప పంట వేసుకునేందుకు వదలాలన్నారు. ఈ విషయంపై తాము జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బోర్డు అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వినతిపత్రాలు పంపుతామన్నారు. త్వరలో తుంగభద్ర ఐసీసీ సమావేశం జరిపి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ఆగస్టు 11న డ్యాంలోని 19వ నంబరు క్రస్ట్గేటు కొట్టుకుపోయి చాలా నీరు వృథా అయినా అప్పుడు దేవుడి దయవల్ల మళ్లీ వర్షాలు కురవడంతో రెండో పంట పండించుకునేందుకు వీలైందన్నారు. మిగిలిన గేట్లు కూడా అధ్వానంగా ఉన్నందున వచ్చే వేసవి సీజన్లో పూర్తిగా మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి పత్తి, మిరప పంటకు నీటి అవసరం ఉన్నందున ముందస్తుగానే నీరు వదలాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.