
వైభవంగా ద్రౌపదమ్మ దేవి కరగ ఉత్సవం
కోలారు : ప్రతియేటా నిర్వహించే విధంగా ముళబాగిలు తాలూకా నంగలిలో ఉన్న ద్రౌపదమ్మ దేవి ఆలయంలో కరగ ఉత్సవాన్ని ఈ యేడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, ధ్వజారోహణం, కల్యాణోత్సవం, హసికరగ, ఒనకె కరగ తదితర పూజలు నిర్వహించారు. కరగను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని పలమనేరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గురువారం రాత్రి గంగమ్మ, కోదండ రామస్వామి, చౌడేశ్వరి, నాగదేవత, గణపతి తదితర దేవుళ్ల పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మదర్శి తాండ్రాయప్ప కోదండ, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎన్ శ్రీధర్ తదితరులు కరగ ఉత్సవంలో పాల్గొన్నారు.