
గృహబంధనం నుంచి తల్లీ బిడ్డకు రక్షణ
కోలారు: ఇటుకల ఫ్యాక్టరీలో గృహబంధనంలో ఉన్న తల్లీబిడ్డను తహసీల్దార్ రక్షించిన ఘటన శుక్రవారం ముళబాగిలులో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరు తాలూకా పొమ్మశెట్టిహళ్లికి చెందిన ప్రశాంత్, వినుత దంపతులు హనుమనహళ్లి సర్కిల్ వద్ద ఉన్న సద్దాం హుస్సేన్ అనే వ్యక్తికి చెందిన మూన్లైట్ ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తుండేవారు. భర్త ప్రశాంత్ భార్య వినుత, నాలుగేళ్ల బిడ్డను అక్కడే వదిలి పరారైనట్లు తెలిసింది. గత కొన్నాళ్లుగా వీరిని ఇటుకల ఫ్యాక్టరీ యజమాని సద్దాం హుస్సేన్ గృహ బంధనంలో ఉంచినట్లు తెలిసింది. తహసీల్దార్ గీత మాట్లాడుతూ ఇటుకల ఫ్యాక్టరీలో గృహబంధనంలో ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో జిల్లా జాగృతి సమితి సభ్యులతో కలిసి స్థలానికి వెళ్లి తల్లీబిడ్డను రక్షించామని తెలిపారు.
కేబినెట్ విస్తరణ ఆలోచన లేదు
● కులగణన సమీక్షకు అనుమతి
● ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినందున మంత్రివర్గ విస్తరణ చేసే ఆలోచన లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కలబుర్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవుల కోసం శాసన సభ్యులు ఎవరూ ఢిల్లీకి రాకూడదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్లకు వివరించామన్నారు. రాష్ట్రంలో కులగణన సమీక్షకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చామన్నారు. శాసీ్త్రయంగా కులగణన నిర్వహించాలన్నారు. నలుగురు నూతన ఎమ్మెల్సీల ఎంపిక జాబితాను పెండింగ్లో ఉంచామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై కేంద్రం ఈడీ అధికారులతో ఉద్దేశపూర్వకంగా దాడులను చేయిస్తోందని ఆరోపించారు. బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటపై బీజేపీ జాతీయ స్థాయిలో దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.
బైక్, ట్యాక్సీలకు హైకోర్టు షాక్
● మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరణ
బనశంకరి: ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్, ట్యాక్సీలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. బైకు ట్యాక్సీల సంచారానికి సంబంధించి మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. శుక్రవారం పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది. బైకు ట్యాక్సీల పర్మిట్ నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది శశికిరణ్ శెట్టి తెలిపారు. అంతేగాక 8 రాష్ట్రాల్లో మాత్రమే బైకు ట్యాక్సీలకు పర్మిట్ ఇచ్చారని, కర్ణాటకతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం బైకు ట్యాక్సీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. నాలుగేళ్ల నుంచి మధ్యంతర ఆదేశాలపై బైకు ట్యాక్సీలు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా బైకు ట్యాక్సీలకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించిందని వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు అప్పీల్ పిటిషన్పై 24 తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

గృహబంధనం నుంచి తల్లీ బిడ్డకు రక్షణ