
పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచాలని సీఎం ప్రతిపాదన
బనశంకరి: న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య 16వ ఆర్థిక కమిషన్కు పలు ప్రతిపాదనలు, సిఫార్సులను అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో సిద్దరామయ్య 16వ ఆర్థిక కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారి, కమిషన్ గౌరవ సభ్యులతో సమావేశమై కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల పంపకాలు, ఆర్థిక విషయాల గురించి రాష్ట్ర ఆశయాలు, నిరీక్షణలు, ప్రతిపాదనలను తెలియజేసి సిద్దరామయ్య మాట్లాడారు. భారత ఆర్థికతలో కర్ణాటక ప్రముఖ పాత్ర ఉందని తెలిపారు. రాష్ట్రంలో దేశం మొత్తం జీడీపీకి సుమారు 7 శాతం ఉందని, జీఎస్టీ సేకరణలో రెండో స్థానంలో ఉందన్నారు. అంతేగాక నిధుల కేటాయింపులో తీవ్ర అసమానత గురించి ఆర్థిక కమిషన్కు వివరించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ప్రతి రూపాయికి ప్రతిగా రాష్ట్రానికి కేవలం 15 పైసలు మాత్రమే అందుతుంది. 15వ ఆర్థిక కమిషన్ కర్ణాటక పన్నుల వాటాను 4.713 శాతం నుంచి 3.647 శాతానికి తగ్గించడంతో 15 ఆర్థిక కమిషన్ అవధిలో రూ.80,000 కోట్లు నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రానికి వాటాల కేటాయింపులో తలెత్తిన అసమానతలు సరిదిద్దాలని 16వ ఆర్థిక కమిషన్కు మనవిపత్రం అందజేశామన్నారు. అంతేగాక కొన్ని ప్రతిపాదనలు కూడా అందజేశామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపకాల్లో కనీసం 50 శాతానికి పెంచాలని, సెస్సులు, సర్చార్జ్లను 5 శాతానికి పరిమితం చేయాలని ప్రస్తావించింది. కేంద్రం పన్నుయేతర ఆదాయం రాష్ట్రాలకు పంపకాల్లో వాటాలను సవరించాలని సిఫార్సు చేసింది. రాష్ట్రాల మధ్య పంపకాలకు సంబంధించి ప్రతి రాష్ట్రం అందించే సేవల్లో సుమారు 60 శాతం తమ వద్ద పెట్టుకొని, 40 శాతం మిగిలిన రాష్ట్రాలకు కేటాయించాలని సూచించింది. కర్ణాటక ఆర్థికతలో బెంగళూరు ప్రముఖ పాత్రను పరిగణించి మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవ్వాలని కోరారు.