
మౌలిక సౌకర్యాల కల్పనకు సూచన
రాయచూరు రూరల్: జిల్లా పరిశ్రమల కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని విధాన పరిషత్ సభ్యుడు, ప్రభుత్వ హామీల అమలు సమితి అధ్యక్షుడు టీ.ఏ.శరవణ సూచించారు. నగరంలోని పరిశ్రమల కేంద్రంలో పర్యటించి అక్కడ సమస్యలపై సుదీర్ఘంగా గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్తో చర్చించారు. 15 రోజుల్లో పెండింగ్లోని సమస్యలను ఇంజినీర్లు, అధికారులు కలిసి పరిష్కరించాలన్నారు. 150కి పైగా పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల అమరిక, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. రూ.120 కోట్లతో చేపట్టిన పరిశ్రమల కేంద్రం నిర్వీర్యమైందన్నారు. రసాయనిక పరిశ్రమల నుంచి విడుదల చేస్తున్న కలుషిత నీటి వల్ల ప్రజలకు రోగాలు వ్యాపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, సభ్యురాలు మహాలక్ష్మి పాల్గొన్నారు.
నిరంతర పరిశోధనలు అవసరం
● బాగల్కోటె స్నాతకోత్సవంలో
గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్
రాయచూరు రూరల్: నేటి అదునిక యుగంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఉద్యాన పంటల సాగుపై లోతైన పరిశోధనలు జరపాలని రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ థావర్చంద్ గెహ్లాట్ పిలుపు ఇచ్చారు. బాగల్కోటె ఉద్యాన విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 25 ఏళ్ల నాటికి అమెరికా కంటే భారత్ పూలు, ఔషధాల ఉత్పత్తిలో ముందంజలో ఉండాలన్నారు. ఉద్యాన పంటల సాగు రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకొని అమెరికాను అధిగమించాలన్నారు. నేడు విద్యా రంగం కేవలం ఉద్యోగం కోసమే కాకుండా స్వయం ఉపాధికి తోడు నలుగురికి ఉపయోగ పడేలా జీవితాన్ని రూపొందించుకోని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ముఖ్య అతిథి హైదరాబాద్ అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ డైరెక్టర్ హిమాంశు పాఠక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించాలన్నారు. బీదర్ తోటల పెంపకంలో కళాశాల విద్యార్థిని సహనా పాటిల్కు 17, భీమవ్వకు 16 బంగారు పతకాలను అందించారు. సహనా పాటిల్ విజయనగర జిల్లా హూవిన హడగలి తాలూకా హొళలు గ్రామంలో టైలర్ కుమార్తె కాగా స్వర్ణ పతకాలు సాధించింది. భీమవ్వ కొప్పళ జిల్లా తళబాళ రైతు కుమార్తె కావడం అభినందనీయం అన్నారు. సమావేశంలో విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ విష్ణువర్దన్, రిజిస్ట్రార్ మహదేవ హెగ్డే, శాసన సభ్యుడు భీమసేన చిమ్మనకట్టి, హన్మంత నిరాణి, అరుణ, అధికారులున్నారు.