
సకాలంలో చికిత్సతో ప్రాణరక్షణ సాధ్యం
బళ్లారి రూరల్: ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సోషల్ మీడియా కోసం ఫొటోలు తీయడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బాధితున్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని సర్జన్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా కర్ణాటక శాఖ అధ్యక్షుడు డాక్టర్ శేఖప్ప మాళగిమని తెలిపారు. శస్త్రచికిత్స వైద్యుల వారోత్సవంలో భాగంగా గురువారం బీఎంసీఆర్సీ క్యాజువాలిటీ విభాగం ముందు ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే బాధితుల్ని ఆసుపత్రికి తరలించడానికి సాయపడేవారు. కాని నేడు మొబైల్లో ఫొటోలు తీస్తున్నారు. యూట్యూబ్ చానెల్స్ అయితే అప్డేటింగ్, లైక్ల కోసం సాయం చేయడం పక్కన పెట్టి లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారన్నారు. ప్రమాద బాధితుడికి సరైన సమయానికి వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అంబులెన్స్లకు దారి ఇవ్వడం సామాజిక సేవగా భావించాలన్నారు. ఇలాంటి సందేశాన్ని వైద్యవిద్యార్థులు నాటక రూపంలో ప్రజలకు విశదపరిచారు. కార్యక్రమంలో ప్రముఖ శస్త్రవైద్యులు డాక్టర్ వై.గురుబసవనగౌడ, డాక్టర్ మహేశ్ దేశాయి, డాక్టర్ రామరాజు, డాక్టర్ గడ్డి దివాకర్, డాక్టర్ రాజశేఖరగౌడ, డాక్టర్ విశ్వనాథ్, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.

సకాలంలో చికిత్సతో ప్రాణరక్షణ సాధ్యం