
కాంతార చిత్రనటుడు మృతి
శివమొగ్గ: హిట్ సినిమా కాంతార రెండవ భాగం పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆ చిత్రంలో నటిస్తున్న హాస్య కళాకారుడు రాకేష్ పూజారి ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. తాజాగా ఆ చిత్ర నటుల్లో ఒకరు, కేరళ త్రిసూర్కు చెందిన మిమిక్రీ కళాకారుడు వీకే విజు గుండెపోటుతో కన్నుమూశారు. కాంతార రెండవభాగం చిత్రం షూటింగ్ తీర్థహళ్లి తాలూకా చుట్టుపక్కల జరుగుతోంది. ఆగుంబె సమీపంలోని యడూరులో ఉన్న హోం స్టేలో ఇటీవల చిత్రం యూనిట్ బస చేసింది. వారితో పాటు ఉన్న వీకే విజుకు బుధవారం రాత్రి ఎదలో నొప్పి వచ్చిందని చెప్పడంతో వెంటనే అతనిని తీర్థహళ్లిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించినట్లు తెలిసింది. మృతదేహాన్ని తీర్థహళ్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆ చిత్ర కథానాయకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది.