
పాడ్ ట్యాక్సీ ఈసారైనా..?
సాక్షి బెంగళూరు: సిలికాన్ నగరంలో గమ్యం చేర్చడానికి బీఎంటీసీ బస్సులు, మెట్రో రైళ్లు ఉన్నాయి. ఇక ప్రైవేటుగా ఆటోలు, క్యాబ్లు సరేసరి. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ బెంగళూరు ట్రాఫిక్ మాత్రం పరిష్కారం కావడం లేదు. వాహన రద్దీని ఛేదించుకుని వెళ్లడం కష్టమైన పనే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న మరో ప్రత్యామ్నాయ ఉపాయం.. పాడ్ ట్యాక్సీ లేదా ఎయిర్పాడ్ వ్యవస్థ. పలు యూరప్ సహా అభివృద్ధి చెందిన దేశాలలో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఏమిటీ ఎయిర్ పాడ్ ట్యాక్సీ?
పాడ్ విధానం అనేది కారు సైజులో ఉంటే ఎలక్ట్రిక్ వాహనం.. ఇందులో డ్రైవర్ ఉండడు. నిర్ణీత ఎత్తులో ట్రాక్ మీద లేదా విద్యుత్ కేబుళ్లకు వేలాడుతూ వాహనం నడుస్తుంది. ట్యాక్సీ మాదిరిగానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. రోడ్లు– ట్రాఫిక్ బెడద ఉండదు కాబట్టి సజావుగా వెళ్లిపోతుంది. ఒకేసారి 5 నుంచి 6 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. బెంగళూరులో ఉన్న వంతెనలు, మెట్రో రైలు వంతెనల కింద తీగలను, స్టేషన్లను ఏర్పాటు చేస్తే సరి. కొత్తగా భారీ నిర్మాణాల అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
కేంద్రం ఏం చెప్పింది
ఈ పాడ్ ట్యాక్సీ సేవల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలోని బెంగళూరుతో పాటు వివిధ పెద్ద నగరాల్లో ఈ సేవలను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గాలిలో సంచరించే పాడ్ సిస్టమ్, చార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో భారత నగరాలకు రానున్నట్లు ప్రకటించారు. తొలుత ప్రయోగాత్మకంగా ఢిల్లీలోని ధౌలా కువాన్ నుంచి మనస్సర్కు పాడ్ ట్యాక్సీలను నడపనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో ఈ సేవలపై అధ్యయనం చేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్ రద్ధీ విపరీతంగా ఉంటుందని, పరిష్కారానికి ఈ కొత్త ప్రాజెక్టును అమలు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం ప్రకటనతో
బెంగళూరువాసుల ఆశలు
ట్రాఫిక్ సమస్య లేని రవాణా వసతి
2017లోనే ప్రయత్నాలు
ఈ పాడ్ ట్యాక్సీ సేవలను తీసుకొచ్చేందుకు బెంగళూరు నగరంలో 2017లోనే ప్రయత్నాలు జరిగాయి. అప్పటి బీబీఎంపీ కమిషనర్ ఎన్.మంజునాథ్ ప్రసాద్ పాడ్ ట్యాక్సీ పథకానికి టెండర్లు కూడా పిలిచారు. ఐఐఎస్సీ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. అయితే పలు కారణాల వల్ల ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది. ఇప్పటికై నా అమలైతే రవాణా రంగంలో మరో సౌలభ్యం లభిస్తుంది.

పాడ్ ట్యాక్సీ ఈసారైనా..?