
హైకోర్టు జడ్జి ప్రమాణం
శివాజీనగర: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పెరుగు శ్రీ సుధ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాజభవన్లో సభా మందిరంలో జరిగిన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య హాజరై న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.
తల్లీ బిడ్డ ఆత్మహత్య
● భర్త వేధింపులే కారణం
మైసూరు: తల్లీబిడ్డలు ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలారు. ఈ విషాద ఘటన జిల్లాలోని నంజనగూడు తాలూకా హుల్లహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తనహళ్లి గ్రామంలో జరిగింది. తల్లి మహదేవమ్మ (38), కుమార్తె సుప్రియ (20) ఉరి వేలాడుతూ కనిపించారు. వీరిద్దరి మృతికి భర్తే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. భర్త జయరాం పరారీలో ఉన్నాడు. ఈ దంపతులకు సుప్రియ ఒక్కతే కూతురు. జయరాం తరచూ పుట్టించి నుంచి డబ్బులు తేవాలని భార్యను వేధించి గొడవ పడేవాడు. అతని ప్రవర్తనతో కూతురు కూడా విసిగిపోయింది. మహదేవమ్మ పలు మార్లు హుల్లహళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు కూడా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సమస్యలతో విసిగిపోయిన తల్లీ కూతురు ఉరి వేసుకున్నారని తెలిపారు.
సైబర్ నిందితుడు
మామూలోడు కాదు
బనశంకరి: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంజనీర్ నుంచి రూ.4.79 కోట్లు దోచే సిన కేసులో అరైస్టెన ఈశ్వర్సింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఓ పెద్ద ప్రజాప్రతినిధి బంధువు అని ఆగ్నేయ విభాగం సైబర్ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్సింగ్ గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి యత్నించాడు. క్యాసినో జూదానికి బానిసై రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు. పెద్దలు బుద్ధిమాటలు చెప్పినప్పటికీ క్యాసినో జూదాలను వీడకుండా మూడేళ్లలో శ్రీలంక కు 33 సార్లు వెళ్లి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం. బెంగళూరులో బాధితుడు మంజునాథను పలు రకాలుగా బెదిరించి డిజిటల్ అరెస్టు చేసి రూ.4.79 కోట్ల నగదును ఖాతాల నుంచి మళ్లించి తన డ్రైవరు అకౌంట్కు జమ చేసుకున్నాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి హైదరాబాద్ విమానాశ్రయంలో ఈశ్వర్సింగ్ ను, డ్రైవరును అరెస్ట్చేశారు. మిగిలిన కిలాడీల కోసం ఢిల్లీ, విశాఖపట్టణం, చైన్నెతో పాటు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. బాధితుని నుంచి ఆస్తి పత్రాల్ని కూడా వంచకులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైకోర్టు జడ్జి ప్రమాణం